రాజకీయ ఆర్థికరంగంలో కాకలు తీరిన పీవీ నరసింహారావుకు సామాజిక పరివర్తనపై కూడా స్పష్టమైన అవగాహన ఉన్నదనడానికి ఆయన అధికార యంత్రాంగంలో తీసుకున్న చర్యలను ఉదాహరణగా చెప్పవచ్చు. మహిళా సమానత్వం సాధించడానికి విద్యాబోధన కీలకమైనదిగా ఆయన భావించారు. ‘మహిళల కోసం సంస్కరణలు, భవిష్యత్ అవకాశాలు’ అనే అంశంపై న్యూఢిల్లీలో 1991 ఆగస్టు 21వ తేదీన జరిగిన సదస్సులో ఇచ్చిన ప్రారంభోపన్యాసంలో- విద్యారంగంలో వివక్షను రూపుమాపితే, మిగతా సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఆయన వివరించారు. మహిళల ప్రయోజనాల పరిరక్షణకు తగిన శాసనం కూడా చేయాలని ఆయన అన్నారు. చట్టం కూడా తోడైతే, విద్యావంతులైన మహిళలు తమ హక్కుల కోసం తామే పోరాడుతారని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల వివక్ష పోవాలంటే సమాజంలో పరివర్తన రావాలని కూడా ఆయన బోధించారు.
నేను కొంతకాలం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాను. అనేక అంశాలు క్రోడీకరించి మానవ వనరుల అభివృద్ధి శాఖను నిర్మించవలసి వచ్చింది. ఇది ఆయా శాఖల కార్యదర్శులను ఒకచోట చేర్చడం కాదు, మానవ వనరులకు సంబంధించిన అనేక అంశాలను ఒక సమ్యగ్దృష్టితో చూడటం. ఒక టీచర్ ఒక విద్యార్థిని పాఠశాలకు తీసుకుపోవాలని భావిస్తుంది. ఆ విద్యార్థి అనారోగ్యం తో ఉన్నాడు కనుక, తల్లి పంపనంటుంది. ‘అనారోగ్యం వైద్యశాఖకు సంబంధించినది, నాది విద్యా శాఖ. అందువల్ల విద్యార్థిని తీసుకుపోతాన’ని టీచర్ అంటుంది. టీచర్కు ఆరోగ్యంతో సంబంధం లేదు. కానీ, తల్లి తమ బిడ్డ ఆరోగ్యాన్ని, చదువును అన్నింటినీ పట్టించుకుంటుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక తల్లి మాదిరిగా అన్ని అంశాలను పట్టించుకోవాలనేది రాజీవ్ జీ ఆలోచన.
కుమారుడు కావొచ్చు, కుమార్తె కావొచ్చు, ఒక శిశువుకు సంబంధించిన అన్ని అంశాలను పట్టించుకోవాల్సిందే. కుమారుడైతే బడికి పంపడం, కుమార్తెను బడికి వద్దనడం సరికాదు. అందువల్లనే బాలికా విద్యకు సంబంధించి ప్రత్యేక కృషి జరుపాలని నూతన విద్యా విధానం సూచిస్తుంది. మొదట విద్యారంగంలో వివక్ష తొలగాలి. విద్యారంగంలో వివక్షను నిర్మూలించినట్లయితే ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు రూపుమాసిపోతాయని నాకు అనిపిస్తున్నది. అన్ని సమస్యలు మటుమాయమైపోతాయని నేననడం లేదు. కొన్ని నిబిడీకృతమైన సమస్యలుంటాయి. కానీ, మానవులతో సాధ్యమైనన్ని సమస్యలు పరిష్కరించవచ్చు. కొందరు తల్లిదండ్రులు కొడుకును బడికి పంపుతారు తప్ప, కుమార్తెను పంపరు. ఈ భావజాలం ప్రజల మనసులో నాటుకుపోయి ఉన్నది. మహిళా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నవారు తల్లిదండ్రుల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించాలి.
మహిళలు విద్యావంతులైతే, వారి రక్షణకు చట్టం కూడా చేసినట్లయితే, ఇక వారి హక్కుల కోసం వారే పోరాడుతారు. వారి హక్కుల కోసం వారు కాకుండా, మరెవ్వరు పోరాడుతారు? వారు పోరాడకుండా ఉండటం మంచిది కాదు. ఈ పోరాటం ఎంతోకాలం సాగదు. కొంతకాలానికి మగవారు కూడా దిగి వస్తారు. విద్యావంతులైన మహిళలు తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇప్పటికీ సమాజంలో అనేక మూఢ నమ్మకాలు పేరుకుపోయి ఉన్నాయి. సతీసహగమనం వంటి దురాచారాలు పాత కాలానికి సంబంధించినవి ఇంకా ఉన్నాయి. మహిళలు అయిష్టంగానే వీటికి బలవుతున్నారు. ఈ దురాచారం అమలులో ఉన్న ప్రాంతం గురించి నేను వివరాలు సేకరించాను. ఈ హీనమైన దురాచారాన్ని వారు గౌరవనీయమైనదిగా భావిస్తున్నారు. ఈ దురవగాహన ఉన్నంతకాలం స్త్రీల పట్ల ఈ దురాచారం కొనసాగుతూనే ఉంటుంది. దేవదాసీ విధానం మరో దురాచారం. దేవుడు కను క మాట్లాడగలిగితే మనం చేస్తున్న పనులకు తీవ్ర నిరసన వ్యక్తం చేసేవాడు. మనలాగా మరే సమా జం ఇంతగా దేవుడిని వాడుకొని ఉండదు. దేవుడిని అత్యంత దోపిడి చేస్తున్న వాడు మానవుడే. రాజకీయాల్లో ఏమీ జరుగుతున్నదనేది చూస్తూనే ఉన్నాం. మూఢనమ్మకాలు మనుషుల్లో గాఢంగా నాటుకుపోయి ఉన్నాయి. మనిషికి మతం అనేది అవసరమే కానీ, మతం పేర అనేక నమ్మకాలు ఎంతో నష్టం చేస్తున్నాయి. దైవ భీతిగల ఒకనాటి సమాజం నేడు లేదు. ఈ దేశంలో మహిళలు అనుభవిస్తున్న వివక్షను గురించి నేను కొత్తగా చేప్పేదేం లేదు. మత విశ్వాసాలను వక్రీకరించడం వల్ల ఏం జరుగుతున్నదో మహిళలకు తెలిసిందే. మతం పేరిట సమాజంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. కానీ మతం అనేది, మూఢ నమ్మకం కాదు. కానీ మన దేశంలో మాత్రం మతం పేరిట సాగిన వక్రీకరణ భయానకమే. ఇతర దేశాలలో ఏం జరుగుతున్నదో నాకు తెలువదు. ఈ వక్ర ధోరణిని నివారించడానికి ఏదో ఒక్కటి చేయాలి. విజ్ఞానం ద్వారా విద్య ద్వారా చైతన్యం ద్వారా ఇది సాధించవచ్చు. విజ్ఞానం లేకపోతే చైతన్యం రాదు, విద్య లేకపోతే విజ్ఞానం రాదు. ఒక్కోసారి విద్య సమకూరినా చైతన్యం రాకపోవచ్చు. కొందరు చైతన్యవంతులైనా సమాజానికి ఉపయోగపడకపోవచ్చు. హిమాయాలకు వెళ్లి సమాజానికి దూరంగా బతుకవచ్చు. అందువల్ల విద్యా, విజ్ఞానం చైతన్యం అనేది ఒకదాంట్లో ఒకటిగా ఇమిడి ఉన్న వృత్తాల వంటివి. ప్రతి వృత్తం అంతకన్నా పెద్ద వృత్తంలో ఇమిడి ఉంటుంది. మనం విద్యను గరిపితే చైతన్యవంతమైన సమాజంలోకి ప్రవేశిస్తాం. అప్పుడు చైతన్యవంతమైన సమాజం తన సమస్యల్ని తాను పరిష్కరించుకోగలదు. శతాబ్దాలుగా పాతుకుపోయిన వివక్షలకు చైతన్యవంతమైన సమాజంలో తావుండదు. వివక్షలనేటివి శతాబ్దాలుగా పేరుకుపోయినవి. ఏ ఒక్కరో చేశారనుకుంటే అది పొరపాటు అవగాహన. ఈ విధమైన పరిస్థితి ఏర్పడటానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది.
ఆ చారిత్రక కారణం తెలుసుకోవాలనుకుంటే చరిత్రలోకి వెళ్లవలసిందే. ఈ వివక్ష ఏర్పడటానికి కారణం తప్పుడు ప్రాతిపదిక కారణమని అంగీకరిస్తాం. కానీ, నేడు తప్పు అనుకున్నది, ఒకప్పుడు ఒప్పు కావచ్చు. ఆనాడు తప్పుడు కారణాన్ని ఒప్పుగా భావించి ఉంటారు. దాన్ని చక్కదిద్దడం ఇప్పటి మన బాధ్యత. దేశానికి స్వాతంత్య్రం రావడం వల్ల ఇటువంటి వివక్షలు చక్కదిద్దే అవకాశం లభిస్తున్నది. మనకు తోచింది చేసుకునే అవకాశం మనకు లభిస్తున్నది. చరిత్రను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తును రూపుదిద్దుకోవాలి. తద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే చైతన్యాన్ని పొందగలగాలి. మహిళా వివక్షను తొలగించడాని కోసం ఎన్నో కమిషన్లు, బృందాలు కృషిచేస్తున్నాయి. వాటి సూచనల ఆధారంగా ఒక చట్టాన్ని చేయవచ్చు. ఆ చట్టం మహిళా వివక్షను నిర్మూలించే ఆయుధం అవుతుంది.
నాగరిక సమాజంలో తుపాకులతో కూడిన పోరాటం ఉండదు. ఖడ్గాలతో యుద్ధం సాగదు. మన పోరాటం చట్టం ద్వారా సాగుతుంది. అదే మన ఆయుధం. అందువల్ల మహిళల పట్ల వివక్షను రూపుమాపటానికి ఒక శాసనం అవసరం. శాసనం సవ్యంగా లేకపోతే, అది న్యాయవాదులకు బంగారు కొండలా మారిపోతుంది. శాసనం సరిగ్గా లేకపోతే సక్రమంగా అమలు కాదు. పోటీ పూర్తికాకుండానే ఓడిపోయినవారమవుతాం. అందువల్ల మనం చేయబోయే చట్టం ఏ విధంగా ఉండాలనేది చెప్పండి. మీరేం ఆలోచిస్తున్నారో తెలియజేయండి. అందరం చర్చించుకొని ఒక ఉత్తమమైన చట్టాన్ని తెద్దాం. ఆ చట్టమే ఒక ఆయుధం. ఆ ఆయుధం పటిష్ఠంగా ఉండాలి. చట్టంతో పాటు సామాజిక ఒత్తిడి కూడా అవసరమే. సామాజిక శక్తి ఎన్నో రూపాల్లో ఉండవచ్చు. విద్యా బోధన కావచ్చు, ప్రజలకు బోధించే అంశం కావచ్చు, ప్రజలు మార్పు కోసం ఉద్యమించాలంటే, అందుకు విద్య అవసరం. మార్పు రావాలంటే ఈ దశలన్నీ దాటుకొని వెళ్లవలసిందే. అన్నింటికెల్లా విద్య అనేది కీలకమైన దశ. మన సమస్యలన్నింటిని మానవీయమైన పద్ధతుల్లో శాసనం ద్వారా పరిష్కరించుకుందాం. కానీ, ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కావలసిందే. మిగతా అన్ని వర్గాలు మీకు అండగా ఉంటాయి.
కొన్ని శతాబ్దాలుగా, కొన్ని సహస్రాబ్దాలుగా కూడా కావచ్చు, మానవాళిలోని సగ భాగం, మిగతా సగ భాగానికి తలొగ్గి వ్యక్తావ్యక్తమైన నైరాశ్యంలో మగ్గిపోతున్నది. ఇలా ఎందుకు జరిగిందో నిజంగా అర్థం కావడం లేదు. దైవ సృష్టిలోని ఒక సగభాగానికి, మరో సగ భాగానికి ఇంత అసమానత్వం ఎందుకుండాలనేది నిరంతరం ఎదురవుతున్న ప్రశ్న. ఈ రెండు అర్ధ భాగాలు పరస్పరాధారమైనవి, పరస్పరానుబంధమైనవి, పరస్పరపూరకమైనవి. ఒక భాగం లేకపోతే, మరో భాగం సంపూర్ణం కాదు. అయినా, కొన్ని శతాబ్దాలుగా మానవజాతి తనపైన తానే, చెప్పలేనంతగా దౌర్జన్యానికి పాల్పడుతున్నది. ‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అని ప్రాచీన కృతుల్లో చెప్పారు. అయినా, వాటినెందుకు పట్టించుకోవడం లేదు? ఇది ఒక వాక్యమో, ఒక శ్లోకమో కాదు. పూర్వీకులు తమ హృదయాల్లోంచి బోధించారు. తాము అనుకున్నది రాశారు. ఇందులో ఆర్భాటమేమీ లేదు. ఆనాడు ఇంతగా అలంకారశాస్ర్తాలు కూడా లేవు. తమ హృదయాల్లోంచి రాసిన నాటి సూత్రాల స్ఫూర్తి ఈనాడు ఎందుకు అంతమైపోయింది? ఇది ఒకసారిగా జరిగింది కాదు, క్రమేణా జరుగుతూ వచ్చింది. చివరికి మానవాళిలోని అర్ధభాగాన్ని తక్కువదిగా మార్చింది. ఆ అర్ధభాగాన్ని తమకన్న చిన్నచూపు చూడటం వేరు, హీనమైనది గనుక చిన్నచూపు చూస్తామనుకోవడం వేరు. ఇటువంటి రెండవరకం ఆలోచన ఉంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది ప్రశ్న?