న్యూఢిల్లీ: సప్లమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడారు. మౌళిక సదుపాయాల కల్పన కోసం నిధుల కేటాయింపు తక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది నుంచి కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ సతమతమైందన్నారు. అనేక రంగాల్లో రెవన్యూ తగ్గిందన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందన్నారు. ప్రస్తుతం పవర్ యూనిట్ ధర భారీగా పెరిగిందని, ఇదో మనకే మంచి సంకేతమన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రామని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, రెవన్యూలోనూ తెలంగాణలో టాప్లో ఉందన్నారు. తెలంగాణ నుంచి ఆదాయం ఎక్కువగా వస్తోందని, అయితే ఆ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం తక్కువగా ఉన్నాయని, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ పేమెంట్స్ తక్షణమే రిలీజ్ చేయాలని ఎంపీ నామా కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు సుమారు మూడు వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు అందాల్సిన పేమెంట్స్ను కూడా రిలీజ్ చేయాలని కోరారు.