న్యూఢిల్లీ: కరోనా తీసుకొచ్చిన పెను మార్పుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా ఒకటి. అప్పటి వరకూ కేవలం పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్లకు మాత్రమే పరిమితమైన ఓ లగ్జరీ అది. కానీ కరోనా పుణ్యమా అని చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అలవాటైంది. ఏడాది కాలంగా ఎంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. అయితే కరోనాకు శాశ్వత పరిష్కారం లభించిన తర్వాత ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వలేమని మెజార్టీ కంపెనీలు తేల్చేస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.
ఎందుకు వద్దంటున్నాయి?
తాజా సర్వేలో ఏకంగా 59 శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఎత్తేయడానికే మొగ్గు చూపుతున్నాయి. ఇండీడ్ జాబ్ సైట్ ఈ సర్వేను నిర్వహించింది. 67 శాతం పెద్ద కంపెనీలు, 70 శాతం మధ్యస్థ స్థాయి కంపెనీలు రిమోట్ వర్కింగ్ సెటప్కు విముఖంగా ఉన్నాయి. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో 60 శాతం పెద్ద, 34 శాతం మధ్యస్థ స్థాయి కంపెనీలు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దంటున్నాయి. మన దేశంలో అయితే స్టార్టప్ కంపెనీలు కూడా ఇంటి నుంచి పనికి ఫుల్స్టాప్ పెట్టి ఆఫీస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఏకంగా 90 శాతం స్టార్టప్లు ఇదే అభిప్రాయంతో ఉండటం విశేషం.
ఉద్యోగులు ఏమంటున్నారు?
సగం మంది ఉద్యోగులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మెట్రోల నుంచి రివర్స్ మైగ్రేషన్ అన్నది తాత్కాలికమే అని 45 శాతం మంది చెప్పగా.. ఒకవేళ తప్పదు అనుకుంటే తిరిగి సొంతూళ్లను వదిలి మెట్రోలకు వెళ్లడానికి సిద్ధమని 50 శాతం మంది స్పష్టం చేశారు. కేవలం 9 శాతం మంది మాత్రమే ఇక మెట్రోలకు వెళ్లేది లేదు, సొంతూళ్లలోనే ఉంటామని చెప్పడం విశేషం. మొత్తం 1200 మంది ఉద్యోగులు, 600 కంపెనీలతో ఈ సర్వే నిర్వహించారు. వీళ్లలో 32 శాతం మంది ఇంటి నుంచే పని చేయడానికి జీతాల్లో కోత విధించినా సరే అని అంటున్నారు.