జిల్లాలో 15 హాబిటేషన్లను గుర్తించాం
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
దేవాపూర్ గిరిజన గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
బేల, మార్చి 17 : జిల్లాలోని గిరిజన తండా లు, గూడేలకు దశల వారీగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని దేవాపూర్ గిరిజన గ్రామంలో బుధవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో విద్యుత్ సౌకర్యంలేని 15 హాబిటేషన్లను గుర్తించినట్లు చెప్పారు. అందులో 9 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, 6 గ్రామాలకు అటవీశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇందులో భాగంగా దేవాపూర్లో ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో 746 గ్రామాల్లో సింగిల్ ఫేస్ను త్రీ ఫేస్గా మార్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 439 గ్రామాల్లో సర్వే పూర్తిచేసుకొని టెండర్ల ప్రక్రియ సాగుతున్నదని పేర్కొన్నారు. మరో 307 గ్రామాలకు కూడా త్రీ ఫేస్ సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ అనుమతులకు ప్రతిపాదనలు సమర్పించామని వెల్లడించారు. అనంతరం గ్రామస్తులకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, డివిజన్ ఇంజినీర్ రమేశ్, ఏడీ లక్ష్మణ్, ఏసీ శంకర్, సర్పంచ్ సుమన్ బాయి రాథోడ్, బేల తహసీల్దార్ రాంరెడ్డి, ఎంపీడీవో రవీందర్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన..
బేల మండలంలోని సైద్పూర్, ఖారా పంచాయతీల పరిధిలోని గర్కగూడ, వంజరిగూడల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గర్కగూడ పల్లె ప్రకృతి వనం, వంజరిగూడ నర్సరీ నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీలో పిచ్చి మొక్కలు, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఏపీవోకు నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవో రవీందర్ను ఆదేశించారు. కార్యదర్శులు హెడ్క్వార్టర్స్లో ఉండాలని, నర్సరీల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని, అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మండలంలోని రైతు వేదికల పనులను వారంలోగా పూర్తిచేసి, ఫొటోలను సమర్పించాలని పంచాయతీ రాజ్ ఏఈ ప్రకాశ్ను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కలను పెంచి సంరక్షించి ఫొటోలు సమర్పించాలని ఎంపీడీవోకు సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, సర్పంచ్లు ఉన్నారు.
ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలి..
ఎదులాపురం, మార్చి 17 : నిరుద్యోగ యువ త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికం గా ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. కేంద్ర, రాష్ట్ర పథకాల కింద పరిశ్రమల శాఖ ద్వారా మంజూరు చేస్తున్న టీఎస్ ఐపాస్, టీ-ప్రైడ్ కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకొని, ఉపాధి పొందాలన్నారు. గత నెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు టీఎస్ ఐ పాస్ కింద 15 దరఖాస్తులకు గాను 8 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. పలు కారణాలతో మూడు దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. మరో నాలుగు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. టీ-ప్రైడ్ కింద అద్దె వాహనాల కొనుగోలు కోసం 9 మంది లబ్ధిదారులకు రూ.23.01 లక్షల సబ్సిడీకి ఆమోదించామన్నారు. అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ డీ పద్మభూషణ్ రాజు, ఎల్డీఎం చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.