దహెగాం, మార్చి 17 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొంచవెల్లి గ్రామానికి చెందిన నికాడి బాబాజీ పీజీలో ఎంసీఏ, డీఈడీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తిరిగి సమయాన్ని వృథా చేసుకోకుండా ఏదైనా వ్యాపారం చేయాలని భావించాడు. తన స్నేహితులను కలిసి చర్చించి చివరకు కోళ్ల ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల క్రితం రూ. 15 లక్షలతో గ్రామ శివారులో తమకున్న భూమిలో 10,000 కోడి పిల్లలను పెంచే సామర్థ్యం గల షెడ్ను నిర్మించాడు. ఇందుకు కావాల్సిన ప్రభుత్వ అనుమతులు కూడా పొందాడు. మొదట 1000 కోడి పిల్లలతో వ్యాపారం మొదలు పెట్టాడు. ప్రస్తుతం 3000 కోళ్లు పెంచుతున్నాడు. ఇప్పటికే ఐదు బ్యాచ్లు పెంచి విక్రయించాడు. దహెగాం మండలంతో పాటు కన్నెపల్లి, వేమనపల్లి, భీమిని, పెంచికల్పేట్, కాగజ్నగర్, బెల్లంపల్లికి తరలించి హోల్సేల్లో అమ్ముతూ లాభాలు పొందుతున్నాడు. అంతేగాక మరో ఆరుగురు కూలీలకు తన ఫామ్లోనే ఉపాధి కల్పిస్తున్నాడు. అతి తక్కువ సమయంలో.. ఎక్కువ ఆదాయం పొందుతూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులతో శభాష్ అనిపించుకుంటున్నాడు.
45 రోజుల్లో.. రూ. 4.50 లక్షల ఆదాయం
ప్రస్తుతం ఆరో బ్యాచ్లో కోడి పిల్లలను పెంచుతున్నాడు. 15 రోజుల క్రితం కరీంనగర్కు వెళ్లి 3000 కోడి పిల్లలను కొనుగోలు చేశాడు. ఒక్కో కోడి పిల్లకు రూ. 45 వెచ్చించాడు. ప్రతి కోడి పిల్ల పెంపకానికి రూ. 145 (దాణా,రవాణా) దాకా ఖ ర్చు అవుతుంది. కోడి పిల్ల 45 రోజుల వరకు రెం డున్నర కిలోల బరువు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో హోల్సేల్ ధర కిలోకురూ.130 పలుకుతున్నది. అంటే రెండున్నర కిలోలకు రూ. 325 వస్తాయి. ఒక్కో కోడి పెంపకానికి రూ.145 ఖర్చు లు పోయినా.. రూ.180 దాకా మిగులుతాయి. ఈ లెక్కన మొత్తం 3000 కోళ్లకు రూ.5 లక్షల 40 వేల వరకు ఆదాయం వస్తుంది.ఇందులో కూలీ లు, కరెంట్ ఖర్చులు రూ.లక్ష దాకా తీసివేసి నా.. రూ. 4లక్షల 40 వేల వరకు లాభం ఉంటుంది.