ఆర్అండ్ఆర్ కాలనీలోకి ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు
ఒక్క రోజే 183 కుటుంబాల ప్రవేశాలు
గృహ ప్రవేశాలకు అదనపు కలెక్టర్ హాజరు
గజ్వేల్ రూరల్, మార్చి 15: గ్రామస్తులందరూ ఎంతో సంబురంగా ఒకే రోజు, ఒకే ఘడియలో కొత్త ఇండ్లలో ప్రత్యేక పూజలు చేసి, పాలు పొంగించారు. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూసిన ఘడియలు రావడంతో ఎంతో సంతోషంతో ఇంటి ఆడపడచులతో కడపలు కడిగించి ఇంట్లోకి అడుగు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్అండ్ఆర్ కాలనీలో కొత్త వాతావరణం కనిపించింది. గజ్వేల్ సమీపంలోని సంగాపూర్ వద్ద నిర్మించిన కాలనీలోకి తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు ఒక్క రోజే 183 కుటుంబాలు సామూహిక గృహప్రవేశాలు చేశారు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి వారికి అన్ని రకాలుగా సహకరించారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామానికి చెందిన 371 కుటుంబాలకు డబుల్బెడ్ రూం ఇండ్లను రెవెన్యూ అధికారులు కేటాయించగా, సోమవారం 183 కుటుంబాలు నూతన ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా పాలుపొంగించి, గుమ్మాలకు తోరణాలు, పూల దండలు వేసి గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు కొట్టి, కొత్త ఇంట్లోకి అడుగులు పెట్టారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి కాలనీలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు గ్రామస్తులు కాలనీకి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం 30 కుటుంబాలు గృహ ప్రవేశాలు చేయగా, సోమవారం అత్యధికంగా నూతన ప్రవేశాలు చేశారు. కాలనీలో అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషంతో ఉన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుండడంతో త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయించి అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. గృహ ప్రవేశాలకు అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ హాజరై, పలువురి ఇండ్లలోకి నేరుగా వెళ్లి ఇంటి యజమానులతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాల్రెడ్డి, సర్పంచ్ ప్రతాప్రెడ్డి ఉన్నారు.
మంచి రోజన ఇంట్లోకి వచ్చాం
మంచి రోజు కావడంతో కొత్త ఇంట్లోకి వచ్చి పాలు పొంగించి పూజలు చేశాం. అందరూ రావడంతో కొత్త ఇండ్లలో సందడి కనిపిస్తున్నది. కట్ట పనులు జరుగుతుండడంతో ఇబ్బందిగానే ఉంది. అందుకు తొందరలోనే అందరూ ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడందరి ఇండ్లు ఒకేలా ఉన్నాయి
కొత్తగా కట్టించిన ఇండ్లన్నీ ఒకే రకంగా ఉన్నా యి. ఊర్లో అయితే అందరం పక్కపక్కనే ఉండేవాళ్లం. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో చోట వచ్చాయి. కొత్త ఇండ్లు బాగున్నాయి. ఊర్లో వచ్చినట్టే ఇక్కడ కూడా భగీరథ నీళ్లు వస్తున్నాయి.
పట్నంలాగా ఏటిగడ్డకిష్టాపూర్
ఇక్కడ అందరికీ మా ఏటిగడ్డకిష్టాపూర్ ఇప్పు డు పట్నంలాగా కనిపిస్తుంది. అందరికి చెప్పినట్లు 250 గజాల స్థలం చూపించారు. ఇల్లు పక్కనే చాలా ఖాళీ జాగా ఉంది. అందరి ఇండ్లు ఒకే రకంగా ఉండడంతో గుర్తుపట్టడం కొద్ది రోజులు ఇబ్బందే.