బంజారాహిల్స్, మార్చి 14: సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన చాలామందికి ఉన్నప్పటికీ, ఆచరణలో పెట్టేవారు తక్కువ మంది ఉంటారని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.వెంకట రామారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ‘జస్టిస్ ఎంఎన్.రావు – డా॥ శాలినీరావు పర్గావంకర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సామాజిక సేవా రంగంలో విశేష సేవలందించిన మూడు స్వచ్ఛంద సంస్థలకు ‘ఆదర్శ్ పురస్కార్’ను ఆదివారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎన్ రావు తన స్వీయ అనుభవాలతో రాసిన ‘గ్లింప్సెస్ ఫ్రం ది రెసిటల్ ఆఫ్ మై లైఫ్’ పుస్తకాన్ని జస్టిస్ వెంకట రామారెడ్డి, విశ్రాంత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ వెంకట రామారారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో వివక్షకు గురయ్యే వారికి ఆకలితో అలమటించేవారికి, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని చేపట్టే స్వచ్ఛంద సంస్థలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా వారిలో మరింత స్పూర్తిని రగిలించవచ్చన్నారు. ఆలోచనలను ఆచరణ రూపంలోకి తీసుకురావడం చాలా తక్కువమందికే సాధ్యమని, అలాంటి పని చేస్తూ అనేక సేవా సంస్థలకు చేయూతనిస్తున్న జస్టిస్ ఎంఎన్.రావు కృషి అభినందనీయమన్నారు. తిరుపతికి చెందిన అభయ క్షేత్రం స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్కు చెందిన డిజైర్ సొసైటీ, విజయనగరానికి చెందిన శోధన చారిటబుల్ ట్రస్ట్కు అవార్డులతో పాటు రూ.2 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, జస్టిస్ రామకృష్ణంరాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.