న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోనున్నాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులంతా ఈ నెల 15, 16 తేదీల్లో సమ్మె చేయనున్నారు. ఇప్పటికే ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం బ్యాంకింగ్ సేవలు ఉండవు. ఇక సోమ, మంగళవారాల్లో ఉద్యోగుల సమ్మె వల్ల వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
దాదాపు పది లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావమే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి వివిధ బ్యాంకుల శాఖల్లో నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్ల క్లియరెన్స్, రుణ దరఖాస్తులకు ఆమోదం వంటి సేవలు స్తంభించనున్నాయి. అయితే ఆయా బ్యాంకుల ఏటీఎం సేవలు యథాతథంగా కొనసాగనున్నాయని వాటి యాజమాన్యాలు పేర్కొన్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు యధాతథంగా సాగనున్నాయి. కానీ దేశీయ బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా మూడోవంతు మాత్రమే. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని తొమ్మిది ఉద్యోగ సంఘాల వేదిక ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను గత నెల ఒకటో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల ప్రైవేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సంపాదించుకోవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకును కేంద్రం ప్రైవేటీకరించింది. ఈ బ్యాంకులో మెజారిటీ వాటాను జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కొనుగోలు చేసింది. గత నాలుగేండ్లలో కేంద్ర ప్రభుత్వం 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. ప్రభుత్వ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులను మాత్రమే కొనసాగించాలన్న దీర్ఘ కాలిక లక్ష్యంలో భాగంగానే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. మిగతా వాటిని విలీనం చేయడం లేదా పూర్తిగా ప్రైవేటీకరించనున్నది.
బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయితే ప్రతియేటా వాటికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్రానికి తప్పుతుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చిన సమ్మె పిలుపు ఉపసంహరణ కోసం ఈ నెల 4,9,10 తేదీల్లో అదనపు చీఫ్ లేబర్ కమిషనర్ వద్ద బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చల్లో ఎటువంటి సానుకూల సంకేతం లభించలేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఓ ప్రకటనలో తెలిపారు.
కనుక 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అంచనా వేశారు. ఉద్యోగ సంఘాల సమ్మె పిలుపు నేపథ్యంలో తమ శాఖలు, కార్యాలయాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో లావాదేవీలపై ప్రభావం పడుతుందని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు సమాచారం ఇచ్చింది.