హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించే గొంతులపై బీజేపీ పగబడుతున్నది. గొంతులను మూయించేందుకు పోలీసు కేసులతో భయపెడుతున్నది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఓ వైపు ప్రశ్నించే గొంతుకలు కావాలంటూ ఉపన్యాసాలిచ్చే బండి సంజయ్.. ఇప్పుడు అదే ప్రశ్నించే గొంతుపై కేసులు పెడుతున్నారు. బండి రూ.600 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారని పెద్దఎత్తున వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ క్రిశాంక్ ట్విట్టర్లో ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే దానికి వివరణ ఇవ్వాలి. కానీ, ‘నన్నే ప్రశ్నిస్తారా?’ అనే అహంకారంతో కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలియాలి. బండి సంజయ్పై తప్పుడు ప్రచారం చేశారని క్రిశాంక్పై శుక్రవారం సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో బీజేపీ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణ ఫిర్యాదుచేశారు. వాస్తవంగా క్రిశాంక్.. బండి సంజయ్ను సమాధానం చెప్పాలని ప్రశ్నించారే తప్ప, అదేపనిగా దానిని ప్రచారం చేయలేదు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, మంత్రులపై వ్యక్తిగతంగా దూషణలు చేసే బండి సంజయ్, ఆ పార్టీ నేతలు.. క్రిశాంక్ ప్రశ్నను మాత్రం జీర్ణించుకోలేకపోయారు.
గత ఏడాది ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారాలపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ‘బండి’ బ్లాక్మెయిలర్ అని కరీంనగర్ గ్రానైట్ క్వారీస్ ఓనర్స్ అసోసియేషన్ మండిపడింది. రెండు లక్షలమంది ఉపాధి పొందుతున్న గ్రానైట్ పరిశ్రమ రోడ్డున పడేలా వ్యవహరిస్తూ సంజయ్ తమను మాఫియాగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రానైట్ వ్యాపారులు ధర్నాలు చేశారు. బండికి రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో నిజం ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించా. దీనికి ఉలిక్కిపడి కేసు పెట్టారంటే ఇందులో వాస్తవం ఉన్నదనే అనుమానం కలుగుతున్నది. మీ కేసులకు మేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో జైళ్లు చూసినం. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటా. నిజానిజాలు తేలేవరకు ప్రశ్నిస్తూనే ఉంటా.
– క్రిశాంక్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్