పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ
భద్రాది జిల్లాకు లక్ష్మీదేవిపల్లిలో..
మామిళ్లగూడెం మార్చి 12 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల అధికారులకు పోలింగ్పై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. రేపు పోలింగ్ జరుగనుండడంతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్గోయల్, రిటర్నింగ్ అధికారులు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శాసన మండలి ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నిక సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, రిటర్నింగ్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై వివరించారు. జిల్లాలో 87,172 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 40 లోకేషన్లలో 127 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు 30 మంది నోడల్ అధికారులు, వారికి సహకారంగా 12 మంది సెక్టోరల్, 22 మంది రూట్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేసేందుకు 22 ైప్లెయింగ్ స్వాడ్ బృందాలు, 22 ప్రత్యేక ప్రత్యేక వీడియోగ్రఫీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు జిల్లాలో 153 మంది ప్రెసైడింగ్ అధికారులు, 153 మంది సహాయ ప్రెసైడింగ్ అధికారులను విధులకు సిద్ధం చేశామన్నారు. వీరితోపాటు 308 మంది ఓపీఓలు 19 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించామన్నారు. 115 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో ఎన్నికల యంత్రాంగానికి పోలింగ్ బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల సిబ్బంది సామగ్రి రవాణాకు 40 ఆర్టీసీ బస్సులను 22 రూట్లకు కేటాయించినట్లు వివరించారు.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు జిల్లా అధికారులు పోలింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు. సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ జిల్లాలో 127 కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు మొబైల్ బృందాలను నియమించామన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ మురళీధర్, శిక్షణ ఐపీఎస్ స్నేహమేహ్రా, అదనపు కలెక్టర్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.మధుసూదన్, ఏసీపీ ప్రసన్నకుమార్, ఎన్నికల డీటీ రాంబాబు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లిలో పోలింగ్ సామగ్రి పంపిణీ
కొత్తగూడెం మార్చి 12 : వారం రోజుల నుంచి కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో పోలింగ్ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ఇన్చార్జీలు రాజు, అభిమన్యుడు పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలో లక్ష్మీదేవిపల్లి రామచంద్రా డిగ్రీ కాలేజీలో బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 42,679 మంది పట్టభద్రులున్నారు. ఇందులో మహిళలు 17,245, పురుషులు 25,425 మంది ఉన్నారు. ఇతరులు 9 మంది ఉన్నారు. జిల్లాలో 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్
భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి వారంరోజుల ముందు నుంచి అధికారులతో సమావేశాలు నిర్వహించి అప్రమత్తం చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్లు పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పీఓలు 75, ఏపీఓలు 75, ఓపీఓలు 150 మందికి విధులు కేటాయించారు. పోలింగ్ నిర్వహణకు తొమ్మిది రూట్లలో 9 మంది సెక్టోరియల్ అధికారులు, 16 మంది నోడల్ అధికారులను నియమించారు.