హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో కనిపించకుండా పోయిన చిన్నారి ఘటన విషాదాంతమయింది. 13 నెలల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మియాపూర్లోని ఓంకార్ నగర్లో నిన్న సాయంత్రం అదృష్యమైన 13 నెలల సోనీ.. సోమవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని నీటిగుంతలో శవమై కనిపించింది.
సోనీ తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజువారీ పనులకు వెళ్తూ సోనీని పక్కింట్లో వదిలిపెట్టి, వారిని చూసూకోవాలని చెప్పారు. అయితే పనులకు వెళ్లి తిరిగివచ్చే సరికి సోనీ కనిపించకుండా పోయింది. దీంతో చిన్నారి అదృష్యంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇవాళ తెల్లవారుజామున వారి ఇంటి ముందు ఉన్న నీటిగుంతలో సోనీ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక హత్య చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.