కిటకిటలాడుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులు
ఈనెల 31 వరకు శిక్షణ తరగతులు
ప్రతిభ చూపిన వారికి ఏడాదంతా ఉచిత శిక్షణ
రెండేండ్ల తర్వాత వేసవిని ఎంజాయ్ చేస్తున్న బాల్యం
జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపుల్లో చిన్నారుల సందడి
మండుతున్న ఎండల్లో ఆటవిడుపుగా మారిన శిబిరాలు
సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవులు వచ్చాయంటే బాల్యానికి పండుగే… పది నెలల పాటు పుస్తకాలతో కుస్తీపడిన ఆ ప్రాయం ఒక్కసారిగా సంతోషం అనే రెక్కలు తొడుగుకొని విహరిస్తుంది. అసలే… రెండు సంవత్సరాలుగా కొవిడ్ మూలాన చిన్నారులంతా వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ ఈ వేసవిలో ఆ మహమ్మారి పీడ లేకపోవడంతో చిన్నారులంతా సమ్మర్ క్యాంపుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని సర్కిళ్లలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులు చిన్నారుల కోలాహలంతో నిండిపోతున్నాయి. అసలే కొన్నిరోజులుగా విపరీతమైన ఎండలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపుల్లో చిన్నారులంతా సేద తీరుతున్నారు. గత నెల 25 నుంచి ప్రారంభమైన ఈ క్యాంపుల్లో ఈ నెల 31వ తేదీ వరకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 6 నుంచి 16 సంవత్సరాల చిన్నారులకు ప్రతి రోజూ ఉదయం 6.15 నుంచి 8.15 గంటల వరకు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. 75 మైదానాల్లో వివిధ క్రీడలకు సంబంధించిన పరికరాలను కూడా జీహెచ్ఎంసీ సమకూర్చింది. 44 రకాల ఇండోర్, అవుట్డోర్ ఆటల్లో ప్రత్యేకంగా 780 కోచ్లు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ రూ. 1.42 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ శిక్షణల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఏడాది పొడవునా కూడా శిక్షణ ఇవ్వనున్నారు.