సిటీ నెట్వర్క్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ వేదికపై తొలిసారి మహిళా ‘వాణి’ వినిపించే అవకాశం వచ్చిందని మహిళా ఓటర్లు సంబరపడిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా 1958 నుంచి ఇప్పటివరకు ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మహిళ ప్రాతినిధ్యం వహించకపోవడం బాధాకరంగా ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో మగువలు దూసుకుపోతున్న తరుణంలో విశ్వనగరం వేదికపై ఒక మహిళ పెద్దల సభ నుంచి వాణి వినిపించకపోవడమనేది చాలా లోటుగా అభివర్ణిస్తున్నారు. అందుకే ఈ లోటును పూడ్చుకునే గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చిందని, ఓటు హక్కు ద్వారా మహిళా వాణిని వినిపిస్తామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహిళా పట్టభద్రుల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మహిళా వాణీకే తాము పట్టం కడుతామని స్పష్టం చేసిన ఓటర్లు.. ఇదే నెలలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నామని, రాజకీయంగానూ అతివలకు ఉన్నత అవకాశాలు దక్కినప్పుడే ఇలాంటి దినోత్సవాలకు సార్ధకత లభిస్తుందని చెప్పారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 1.90 లక్షలకు మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సంతోషంగా ఉంది..
మండలి ఎన్నికల్లో మొ దటి సారి ఓటు వేయ డం సంతోషంగా ఉంది. చదువుకున్న వ్యక్తులు ఓటు వేసే ఈ ఎన్నికల్లో అర్హత ఉన్న వారికే ఓటు వేస్తారని భావిస్తున్నా.
-పద్మ, అధ్యాపకురాలు, గుండ్లపోచంపల్లి
అన్ని వర్గాల సంక్షేమానికి…
విద్యావంతులైన యువత ప్రజాస్వామ్యం కలిపించిన ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు వేస్తున్నా.. ఆనందంగా ఉన్నది. అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే వారికే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. మహిళా అభ్యర్థికే పట్టం కట్టి… మండలిలో మహిళల వాణి వినిపించాలి.
-షేక్.కె హాబీమున్నీసా, ముషీరాబాద్
వాణి వినిపించేవారికే పట్టం…
తొలిసారి ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటున్నా. పెద్దల సభకు వెళ్లే వారిని ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. మహిళా శక్తిని చాటుకునే గొప్ప అవకాశం వచ్చింది. ఓటుతో వాణి వినిపించేవారినే మండలికి పంపాలి.
-వర్కల రాధిక, మార్కండేయనగర్
విద్యావంతులకే…
పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదైన అనంతరం తొలి సారి గా ఓటు హక్కును వినియోగించుకుంటున్నందుకు సంతోషంగా ఉ న్నది. సాధారణ ఎన్నికల కంటే నిజంగా ఈ పట్టభద్రుల ఎన్నికలు ఎంతో కీలకమైనవని నా అభిప్రాయం. కేవ లం పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు ఉండటం వల్ల ఎంతో విజ్ఞతతో ఓటు వేసే అవకాశం ఉంటుంది. మంచేదో చెడేదో గుర్తిం చే సామర్థ్యం విద్యావంతులకే ఉంటుంది. .గ్రాడ్యుయేట్గా ఓటు ఎవరికీ వేయాలో ఇప్పటికే ఓ అంచనాతో ఉన్నా. – సింధూ ఆతృతతో ఎదురుచూస్తున్నా…
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నా… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో విజ్ఞతతో ఓటు వేస్తా. మొదటి సారి ఓటు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను కొన్నేండ్లుగా అధ్యయనం చేస్తున్నాను. ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నాను. నాకు ఓటు హక్కు వచ్చిందని సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో నా ఆనందానికి అవధుల్లేవు. అభివృద్ధికి కోసం కృషిచేసే వారికే నా ఓటు.