బడంగ్పేట, మే 1: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో ఆమె జిల్లా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పహాడీ షరీఫ్లోని ప్రీమియర్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ను 24 గంటల్లో కొవిడ్ కేర్ సెంటర్గా మార్చాలని ఆదేశించారు. ఇప్పటికే వనస్థలిపురంలో 100 పడకలు, కొండాపూర్లో మరో 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శివరాంపల్లి, షాద్నగర్లో యుద్ధప్రాతిపదికన సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.