సుల్తాన్ బజార్, మార్చి 8 : దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏపీ ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో “రోల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్” అంశంపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ యాదవ్ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మారుతున్న సమాజంలో ప్రతి రంగంలో మహిళలు దూసుకుపోతున్నారన్నారు. రాజకీయాల్లోనూ వారికి ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీలో 50శాతం స్థానాలను మహిళలకు కేటాయించారన్నారు. అంతేకాకుండా మేయర్, డిప్యూటీ మేయర్లుగా కూడా మహిళలకే అవకాశం ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవు ఉంటుందన్నారు. ఇలా సెలవు ఇస్తున్న రాష్ట్రం సైతం తెలంగాణ ఒక్కటే అన్నారు. పార్లమెంట్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుకుంటున్నానని, అది అమల్లోకి వస్తే తాను చాలా సంతోషిస్తానని అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆయా రంగాల్లో మహిళలను పోత్సహించేందుకు వీ-హబ్ లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.
గడిచిన ఆరున్నరేండ్లలో హైదరాబాద్ను ఎంతగానో అభివృద్ధి చేశామని, మహిళల భద్రత, రక్షణకు ఇక్కడ అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 93మందిలో బరిలో నిలిచిన ఏకైక మహిళ వాణీదేవి అన్నారు. అందుకే మహిళలందరూ సీరియల్ నంబరు 4లో సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ఏ ఎన్నికలు జరిగినా 40శాతానికి మించి ఓట్లు నమోదు కాకపోవడంతో హైదరాబాద్ నగరానికి చెడ్డపేరు తెచ్చిందన్నారు. పట్టభద్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎకనామిక్ కమిటీ ఏపీ అధ్యక్షుడు ప్రభాశంకర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వినయ్కుమార్, కార్యదర్శి పీఎల్ శ్రీనివాస్, ప్రొఫెసర్ అనురాధ, అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు.