వ్యాధి నిర్ధారణకు పరీక్షలు తప్పనిసరి. అయితే ప్రైవేటులో ఏ చిన్న టెస్టు చేయించాలన్నా.. సామాన్యులకు తలకు మించిన భారమే. వేలకు వేలు ధారపోయాల్సిందే. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను గుర్తించి.. మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ , వెల్నెస్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ తీసుకున్న నమూనాలు పరీక్షించి..రిపోర్టులు ఇచ్చేందుకు నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఆవరణలో 2018లో ‘తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ (తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం)ను నెలకొల్పింది. ఈ మూడేండ్లలో ఇక్కడ 27.98 లక్షల టెస్టులు చేశారు. దీనిద్వారా ఏడాదికి రూ. 15కోట్ల నుంచి రూ. 20 కోట్ల ప్రజాధనం ఆదా అయింది.
57 రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు. సాధారణ రక్త, మల, మూత్ర పరీక్షలతో పాటు టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణకు, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరును తెలుసుకోవడానికి, రక్తంలో కొలెస్ట్రాల్, మూణ్నెళ్ల సగటు చక్కెర స్థాయి.. తదితర పరీక్షలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ పరికరాలను ఏర్పాటు చేశారు.రోజుకు వంద మందికి ఈసీజీ చేస్తున్నారు. 8 నుంచి 10 మంది వరకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలో చికిత్స చేయిస్తున్నారు. త్వరలోనే సీటీ స్కాన్ , ఏంఆర్ఐ పరికరాన్ని అందుబాటులోకి తేనున్నారు.
ఐపీఎం ఆవరణలో రూ.4 కోట్లతో ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ పరిధిలోకి గ్రేటర్లోని యూపీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులన్నీ వస్తాయి. రోజుకు కనీసం 25వేల నమూనాలను పరీక్షించేందుకు వీలుగా ప్రయోగశాల ఉంది. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ వైద్య నిపుణులు ఉన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్లలో కొందరి సేవలను వినియోగించుకుంటున్నారు. తొలుత 50 యూపీహెచ్సీల్లో రక్త నమూనాల సేకరణ, ప్రయోగశాలలో పరీక్షలు, ఆన్లైన్లో ఫలితాల వెల్లడి వంటివి చేసేవారు. ప్రస్తుతం ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో 327 కేంద్రాల నుంచి రోజుకు 5వేల నుంచి 7వేల వరకు నమూనాలను సేకరించి, పరీక్షించి, ఆన్లైన్ ద్వారా రిపోర్టులు ఇస్తున్నారు. కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలతో 57 రకాల రక్త పరీక్షలు, ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, ఈసీజీ వంటి ఖరీదైనవి కూడా ఉచితంగా చేస్తున్నారు.
రోజుకు 327 కేంద్రాలకు 5వేల నుంచి 7వేల నమూనాలు వస్తున్నాయి. రౌండ్ ది క్లాక్ 25వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రిపోర్టులు పంపిస్తున్నాం. ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. త్వరలోనే 130 రకాల టెస్టులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నది.