సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) :బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పాఠశాలలకు అదనపు సెలవులు ప్రకటించడంతో పట్నం అంతా పల్లెబాట పట్టింది. ప్రకృతి అందాల నడుమ ఆత్మీయులను కలుసుకోవాలని, జమ్మి పంచుకోవాలని సంబురంగా తరలివెళ్లారు. ఇదిలాఉండగా నగరంలో పూలు, పండ్లు, స్వీట్ల షాపులు కొనుగోలు దారులతో సందడిగా మారాయి. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అమాంతం ఒక్కసారిగా ధరలను పెంచేశారు.
15 రోజుల ముందే బుకింగ్
గతేడాది కంటే 15రోజుల ముందుగానే వ్యాపారులు నాటు కోళ్లు, మేకలు, గొర్లను నగరానికి తరలించారు. 5-10కిలోల బరువు ఉండే మేక, గొర్రె పోతులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని జియాగూడ మేకల మండీకి చెందిన వ్యాపారి రవీందర్ తెలిపారు. దసరా సందర్భంగా ఇప్పటికే 650 టన్నులకు పైగా మటన్ అమ్మినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్ సేల్ ధర రూ.680 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.780-820కి వ్యాపారులు విక్రయిస్తున్నారు.
పండుగ పూట మాంసంపై ఆఫర్లు
మెట్రో సిటీలో ఆన్లైన్ మాంసం విక్రయించే కంపెనీలు పండుగ ఆఫర్లు ప్రకటించాయి. ప్రస్తుతం సిటీలో ఫ్రెషో, ఫ్రెష్ టూ హోం, ఫిఫోలా వంటి కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. కిలో మాసం రూ.400 కొనుగోలు చేస్తే అరకిలో చికెన్ ఫ్రీగా విక్రయిస్తుండగా, ఒక్క రోజు ముందుగా బుకింగ్ చేసుకుంటే ధరపై 15-30శాతం డిస్కౌంట్లతో మాంసం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.