సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు, కిశోర బాలికలకు ఒకపూట పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లడంలేదు. దీంతో ప్రభుత్వం ‘టేక్ హోం రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇందులో అధికారులు, అంగన్వాడీ టీచర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రతినెలా సరుకులు అందిస్తున్నారు. ఈ పథకం అమలు మరింత పారదర్శకంగా జరుగాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఆధునాతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా ఎన్ఐసీ సాంకేతిక సహకారంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం నుంచి ఐటీ నిపుణులు ఆరోగ్యలక్ష్మి పథకం అమలును ఆన్లైన్లో పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ‘ఆరోగ్య లక్ష్మి’ యాప్ను ఆవిష్కరించి, ఈ పథకంలోని లబ్ధిదారులు, వారికి అందించిన సరుకుల వివరాలను యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం దీన్ని హైదరాబాద్ జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉన్నదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై అంగన్వాడీ టీచర్లకు జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చామని హైదరాబాద్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి ఆకేశ్వర్ రావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
ప్రస్తుతం ఆరోగ్యలక్ష్మి పథకంలో ఇస్తున్న టేక్ హోం రేషన్ వివరాలను మాన్యువల్గా నమోదు చేస్తున్నారు. ఇక నుంచి లబ్ధిదారుల వివరాలను ఆధార్తో లింక్ చేసి, ఆరోగ్యలక్ష్మి యాప్లో రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు ఐడీ నంబర్లను కేటాయిస్తారు. ఆ తర్వాత అంగన్వాడీ టీచర్ లబ్ధిదారులకు సరుకులు ఇచ్చే సమయంలో ఒక ఫొటో తీసుకొని, ఆరోగ్యలక్ష్మి యాప్లో అప్లోడ్ చేస్తారు. దీన్ని ఆధార్తో లింక్ చేయడంతో పూర్తిగా పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, లబ్ధిదారుల జాబితాలో ఉన్న అనర్హులను కూడా సులభంగా తొలగించే అవకాశం ఉంది.
సాధారణంగా ఒక అంగన్వాడీ కేంద్రానికి ఎన్ని సరుకులు వచ్చాయి.. ఎన్ని సరుకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. అనే వివరాలను ఇప్పటి వరకు మాన్యువల్గా నమోదు చేస్తున్నారు. ఇక నుంచి అంగన్వాడీ కేంద్రంకు వచ్చిన సరుకులను తీసుకునే సమయంలో టీచర్ వద్ద బయోమెట్రిక్ తీసుకుంటారు. అనంతరం డిస్ట్రిబ్యూషన్ ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దీంతో ఎన్ని సరుకులు వచ్చాయి.. ఎన్ని సరుకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో ఎంత స్టాక్ అందుబాటులో ఉంది.. అనే వివరాలను జిల్లా కార్యాలయంలో ఉండి ఆరోగ్యలక్ష్మి యాప్ ద్వారా జస్ట్ ఒక్క క్లిక్తో తెలుసుకునే అవకాశం ఉందని, దీంతో కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే అవినీతి కూడా కట్టడి అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం గ్రోత్ మానిటరింగ్ తీసుకోవడం లేదు. కానీ, ఆరోగ్య లక్ష్మి యాప్ ద్వారా ఇక నుంచి 0-5 ఏండ్లలోపు చిన్నారుల గ్రోత్ మానిటరింగ్ను కూడా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.