హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): దేశ భద్రత కోసం విరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని సీఆర్పీఎఫ్ సిబ్బందికి సదరన్ సెక్టార్ ఐజీ మహేశ్చంద్ర లడ్డా పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ 83వ వ్యవస్థాపక దినాన్ని జూబ్లీహిల్స్లోని సదరన్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్చంద్ర లడ్డా అమరుల స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు.అనంతరం ఐజీ లడ్డా మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల నిర్వహణ, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు సహా పలు కీలక విధుల్లో సీఆర్పీఎఫ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
వీవీఐపీ ఇండ్ల వద్ద భద్రత కల్పించే స్పెషల్ డ్యూటీ గ్రూప్, యాంటీ మావోయిస్టు ఆపరేషన్స్ పాల్గొనేందుకు ప్రత్యే క తర్ఫీదు పొందిన పది కోబ్రా బెటాలియన్లు సహా పలు ప్రత్యేక విభాగాలతో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో సీఆర్పీఎఫ్ది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. వీలైనంత వరకు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, పర్యావరణ పరిక్షణకు మరింత కృషి జరగాలని ఐజీ మహేశ్చంద్ర లడ్డా అన్నా రు. కార్యక్రమంలో డీఐజీలు రాజ్కుమార్, ఖాజా సజావుద్దీన్, కమాండెంట్లు విశ్వనాథ్, అమర్సింగ్ మీనా, డిప్యూటీ కమాండెంట్లు ఇతర సిబ్బంది పాల్గొని అమరులకు ఘనంగా నివాళులర్పించారు.