8 నెలల పసివాడిని చంపిన కసాయి తండ్రి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఘటన
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 7: ఎనిమిది నెలల వయసు. అప్పుడప్పుడే ముద్దుముద్దుగా ‘నాన్న’ అని పిలిచేందుకు ప్రయత్నించే పసితనం. అలాంటి కొడుకును లాలించాల్సిన ఓ తండ్రి నీటిసంపులో పడేసి ఊపిరితీశాడు. భార్యపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లిలో చోటుచేసుకున్నది.
శంషాబాద్రూరల్ పోలీస్స్టేషన్ సీఐ ప్రకాశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణానికి చెందిన ఇప్పునూతన స్పందనను ఐదేండ్ల కిందట తొండుపల్లి గ్రామానికి చెందిన గంద్రం విక్రమ్కుమార్ ఇచ్చి పెండ్లిచేశారు. రెండేండ్ల నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. పిల్లలు పుట్టడంలేదని భార్యను వేధించేవాడు. ఎనిమిది నెలల కిందట వారికి హార్దిక్ పుట్టాడు. అప్పటినుంచి విక్రమ్ మద్యానికి బానిసగా మారాడు. ‘బాబు నాకు పుట్టలేదు. నీకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావు’ అంటూ భార్యతో గొడవపడేవాడు.
మంగళవారం మళ్లీ స్పందనతో ఘర్షణపడ్డాడు. నిద్రలో ఉన్న కొడుకు హార్దిక్ను ఇంటిముందు ఉన్న నీటిసంపులో పడేసి పైకప్పు పెట్టాడు. తర్వాత టీ తాగేందుకువెళ్లి గ్రామానికి చెందిన స్నేహితుడితో విషయాన్ని చెప్పాడు. అతడు వెంటనే విక్రమ్తో కలిసి వచ్చి నీటిసంపులో చూడగా.. హార్దిక్ నీటిపై తేలియాడుతూ కనిపించాడు. దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.