కొండాపూర్, మే 29: సిబ్బందితో పాటు టీకా కోసం వస్తున్న వారందరూ తప్పనిసరిగా కొవిడ్ నియమాలను పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు.
ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. సర్కిల్-21 పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ఏర్పాట్లు, వ్యాక్సిన్ కోసం వస్తున్న వారి వివరాలను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, చందానగర్ డీసీ సుధాంశ్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరికీ టీకా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కాగా పీజేఆర్ స్టేడియంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో రోజుకు వెయ్యి మంది రిజిస్ట్రేషన్లు చేసుకుని వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు. వ్యాక్సినేషన్ కొరకు 80 మంది సిబ్బందితో 10 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా రెండోరోజు 923 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ ఏఎంహెచ్వో డాక్టర్ కార్తీక్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, మే 29: శేరిలింగంపల్లి సర్కిల్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ శనివారం సందర్శించారు. ప్రజలకు అందుబాటులో సౌకర్యాలు, వైద్యసేవల గురించి వెస్ట్జోన్ కమిషనర్ రవికిరణ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా టీకాలు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీ వెంకన్న పాల్గొన్నారు.