సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గ్రేటర్లోనే ప్రతి ఏటా సుమారు 30 వేల నుంచి 40 వేల మం ది రోగులు కిడ్నీ సమస్యలతో దవాఖాన్లను ఆశ్రయిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గ్రేటర్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు నగరంలో ప్రతి సంవంత్సరం సుమా రు 10 వేల నుంచి 12 వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నట్లు నెఫ్రాలజి నిపుణులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ సంబంధిత వ్యాధులున్నట్లు వైద్య నివేదికల ద్వారా తెలుస్తోంది. బాధితుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాకు ఒక డయాలసిస్ సెంటర్ను ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడేళ్ళ క్రితం గ్రేటర్ పరిధిలో మొత్తం ఆరు చోట్ల డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నిరుపేదలపై తగ్గిన ఆర్థిక భారం..
సాధారణంగా ఒక్కసారి డయాలసిస్ చేయించాలంటే కార్పొరేట్ దవాఖానలో రూ.3వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతుంది. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వారానికి ఒకటి లేదా రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. మరి కొందరికి నెలలో రెండు లేదా ఒకసారి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక రోగికి ప్రతినెల సుమారు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థిక భారం పడుతుంది. ప్రధానంగా నిరుపేద రోగులు ఈ ఆర్థిక భారం భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకునేవారు. మరి కొంతమంది ఆర్థిక స్థోమత లేక సమయానికి డయాలసిస్ చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు గతంలో చాలా ఉండేవి. అదే కాకుండా డయాలసిస్ కోసం రోగులు రాష్ట్ర నలుమూలల నుంచి నగరానికి వచ్చి ఆయా దవాఖానాల వద్ద నిరీక్షించాల్సి వచ్చేది. దీని వల్ల అటు ఆర్థిక ఇబ్బందులే కాకుండా రోజువారి పనులు చేసుకునే వారికి వృత్తి, వ్యాపా ర పరంగా కూడా సమస్యలు ఎదురయ్యేవి. దీనిని గమనించిన తెలంగాణ సర్కార్ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం అన్ని జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆపన్న హస్తం అందించింది.