హైదరాబాద్: నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలిపోయింది. దీంతో క్రమంగా మంటలు పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాయిలర్లలో ఇంకా పేలుళ్లు సంభవిస్తున్నాయి. దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతంలో పొగలు దట్టంగా అలముకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.