సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ )/మణికొండ/బండ్లగూడ : జంట జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేసి దిగువ మూసీలోకి నీటిని పంపిస్తున్నారు. హిమాయత్సాగర్లోకి 1400 క్యూసెక్కుల నీరు వస్తుండగా,17 గేట్లలో ఏడు గేట్లు ఎత్తివేసి దిగువకు 2400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గండిపేట రిజర్వాయర్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 400 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 15 గేట్లలో రెండు గేట్లను ఎత్తి వేసి 100 క్యూసెక్కుల నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. శుక్రవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. వరద పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట జలమండలి ఎండీ దానకిశోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎమ్ దశరథ్ రెడ్డి, జీఎం రామ కృష్ణ తో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్తో కలిసి శుక్రవారం హిమాయత్సాగర్, పల్లె చెరువు, అప్ప చెరువు, కమిషనరేట్ పరిధిలోని ఇతర చెరవులు, కుంటలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. పోలీసులు 24 గంటలు విధి నిర్వహణలో ఉంటూ చెరువులు, జలాశయాల పరిసరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటారని సీపీ తెలిపారు.
రాష్ట్రంలో భారీ వర్షాలతో కూడిన వరద బాధిత ప్రజలకు సహాయం అందించేందుకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) కార్యనిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. పుదుచ్చేరి నుంచి శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్ భవన్ అధికారులు, ఐఆర్సీఎస్ జిల్లా విభాగాలతో మాట్లాడారు. వివిధ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఆస్తి, పంటలు పోవడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐఆర్సీఎస్ ద్వారా నిరుపేదలకు సహాయక చర్యలను విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఆమె రాజ్భవన్ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితులపై శుక్రవారం ఆ శాఖకు చెందిన సీజీఎంలు, ఎస్ఈలు, మేనేజింగ్ డైరెక్టర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల సరఫరాలో అంతరాయం కలిగిందని, చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో 517 స్తంభాలు, 28 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఏవైనా ఏర్పడితే ఎదుర్కొనేందుకు అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.