ముంబై : మహారాష్ర్టలో కరోనా కోరలు చాచింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ.. తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 13,659 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలని ఆరోగ్య శాఖ రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరింది. ఎక్కడైతే కరోనా కేసులు అధికమవుతున్నాయో.. అక్కడ రాష్ర్ట ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది.
గడిచిన 24 గంటల్లో పుణెలో కొత్తగా 2840 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం పుణెలో 17,209 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఒక్క పుణెలోనే కరోనాతో ఇప్పటి వరకు 9,356 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 15 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఔరంగాబాద్లో నైట్ కర్ఫ్యూ
కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. ఔరంగాబాద్లో పోలీసులు నైట్ కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కర్ఫ్యూ అమల్లో ఉన్నంత వరకు రాత్రి సమయాల్లో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు అనుమతి లేదు. కేవలం పార్శిల్స్కు మాత్రమే అనుమతిచ్చారు.
నాగపూర్లో లాక్డౌన్
కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా.. నాగపూర్లో మార్చి 15 నుంచి 21వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నితిన్ రౌత్ గురువారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి ఉద్యోగులను అనుమతించనున్నారు. ప్రయివేటు ఆఫీసులను పూర్తిగా మూసివేయనున్నారు.