వరంగల్: మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండ వేయిస్తంభాల గుడిలో కొలువైన రుద్రేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాలయానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లికి అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామి వారి పట్టు వస్త్రాలతో సన్మానించి వేద ఆశీర్వచనం అందించారు. అదేవిధంగా ఐనవోలు మల్లికార్జున స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాశివరాత్రి శివపార్వతుల పెండ్లి రోజని, లింగోద్భవం జరిగిన రోజని చెప్పారు. ఈ రోజు ఆ మణికంఠుని దర్శనం అత్యంత పవిత్రమైనదిగా శివ భక్తులు భావిస్తారని అన్నారు. శివపార్వతుల ఆశీర్వచనాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతం అవుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ దేవాలయాల జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు జీతభత్యాలు, అర్చకుల వయో పరిమితి పెంపు, యాదాద్రి పునర్నిర్మాణం వంటి చర్యలతో దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నారని వెల్లడించారు.
హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేయిస్తంభాల గుడి, సిద్దేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు రుద్రేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.