ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఆటోమొబైల్ షాపు యజమాని మన్సుక్ హైరెన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేను ఆ రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ నుంచి తప్పించింది. కేసులో విచారణ పూర్తయ్యే వరకు అతనికి మరో డిపార్టుమెంట్లో బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు.
ముంబైకి ఆటోమొబైల్ షాపు యజమాని మార్చి 5న సముద్రంలో శవమై తేలాడు. దాంతో అతని భార్య విమలా హైరెన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే తన భర్తను హత్య చేశాడని అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ సజావుగా సాగేందుకు సచిన్ వాజేను క్రైమ్ బ్రాంచ్ నుంచి తొలగించినట్లు హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. పోలీస్ అధికారి సచిన్ వాజే ఆటోమొబైల్ షాపు యజమాని మన్సుక్కు చిరపరిచితుడు. తన కార్లకు సంబంధించిన పరికరాలను మన్సుక్ షాపులోనే సచిన్ వాజే కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు మన్సుక్ కారును కూడా సచిన్ వాజే వాడుకునేవాడు. గత నవంబర్లో మన్సుక్కు చెందిన స్కార్పియో కారును తీసుకున్న సచిన్ వాజే ఫిబ్రవరి 2న తిరిగిచ్చాడు.
ఫిబ్రవరి 17న మన్సుక్ వ్యక్తిగత పనిమీద బయటివెళ్లి ముంబైకి వస్తుండగా విఖ్రోలి ఏరియాలో చెడిపోయింది. దాంతో కారును అక్కడే వదిలేసి ఇంటికెళ్లిన మన్సుక్ మరునాడు వెళ్లిచూడగా కనిపించలేదు. దాంతో విఖ్రోలి పోలీస్స్టేషన్లో తన కారు పోయిందని ఫిర్యాదు చేశాడు. అయితే ఫిబ్రవరి 25న ఆ కారును సౌత్ ముంబైలోని ముకేశ్ అంబానీ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.
కారులోపలి పేలుడు పదార్థాలు, ముకేశ్ అంబానీని బెదిరిస్తున్నట్లుగా లేఖ లభ్యమయ్యాయి. ఈ కేసు విచారణ పేరుతో సచిన్ వాజే తరచూ మన్సుక్ను వెంట తిప్పుకున్నాడు. చివరిసారిగా మార్చి 3న కూడా మన్సుక్ను విచారణకు రావాలని సచిన్ వాజే పిలిపించాడు. ఆ రోజు ఇంట్లో భార్యకు చెప్పి వెళ్లిన మన్సుక్ మార్చి 5న సముద్రంలో శవమై తేలాడు. దాంతో సచిన్ వాజేనే తన భర్తను హతమార్చి సముద్రంలో పడేసి ఉంటాడని విమల హైరెన్ ఫిర్యాదు చేశారు.