న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మంగళవారం ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీఎస్ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశాలు సాగనున్నాయి.
పార్టీ సంస్ధాగత ఎన్నికలకు ముందు రాహుల్ను పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంస్ధలు పలుమార్లు ఇలాంటి తీర్మానాలు చేశాయి. పలు పార్టీ రాష్ట్ర శాఖలు సైతం రాహుల్నే తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని తీర్మానించాయి. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం జూన్లో కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి ఎన్నిక జరగనుంది.