మేడ్చల్ రూరల్, మార్చి 6 : సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడే తత్వం అలవర్చుకుంటే అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ చైర్మన్ రామిరెడ్డి మాట్లాడుతూ గెలుపోటముల నుంచి పాఠాలుగా మలుచుకొని, వృత్తి, వ్యాపారంలో ఎదగాలన్నారు.
కళాశాల డైరెక్టర్ రామస్వామిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది 9.99 జీపీఏతో కస్తూరి వేదాంత శ్రీనివాస్ కళాశాలలో అగ్రగామిగా నిలువగా, అత్యధికంగా రూ.12 లక్షల ప్యాకేజీతో ఈఈఈకి చెందిన శివసాయి రామకృష్ణ ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి మహేందర్రెడ్డి, శాలినీరెడ్డి, జేఎన్టీయూహెచ్ మాజీ రిజిస్ట్రార్ రామిరెడ్డి, మాజీ రెక్టార్ సాయిబాబారెడ్డి, కో ఆర్డినేటర్లు సురేంద్రనాథ్రెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు, పతకాలను ప్రదానం చేశారు.