ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. తొలి టెస్టులో ఘోర పరాభవం మూటగట్టుకున్న చోటే లెక్కసరిచేయాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఎన్నో అంచనాల మధ్య ఏడాది అనంతరం సొంతగడ్డపై ఆడిన మొదటి మ్యాచ్లో ఓడిన కోహ్లీసేన.. అదే వేదికపై రెండో టెస్టు కోసం రెడీ అయింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తు గల్లంతయ్యే ప్రమాదం ఉండటంతో ఈ పోరు కోసం భారత్ స్పిన్ పిచ్ను సిద్ధం చేయించింది. మరోవైపు తొలి టెస్టు విజయంతో ఊపులో ఉన్న రూట్ సేన అదే జోరు కొనసాగించి పైచేయి సాధించాలనుకుంటున్నది. చాన్నాళ్ల తర్వాత అభిమానులను అనుమతించనున్న మ్యాచ్లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరం!
చెన్నై: ఆరంభ పోరులోనే పరాజయం పలకరించడంతో టీమ్ఇండియా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెరీనా తీరంలో ఇంగ్లిష్ ఆటగాళ్లను స్పిన్ ఉచ్చులో బిగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలువాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ సత్తచాటాల్సిన స్థితిలో టీమ్ఇండియా శనివారం నుంచి ఇంగ్లండ్తో రెండో టెస్టుకు రెడీ అవుతున్నది. సొంతగడ్డపై తమ ప్రధాన బలమైన స్పిన్తోనే ప్రత్యర్థిని పడగొట్టాలనే ఉద్దేశంతో చెపాక్లో పూర్తి స్పిన్ పిచ్ను సిద్ధం చేయించింది. గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ అరంగేట్రం చేయనుండటం దాదాపు ఖాయం కాగా.. కుల్దీప్ యాదవ్కు జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో అభిమానులు సందడి చేయనుండటం కోహ్లీసేన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుండగా.. రెండో టెస్టులోనూ విజయం సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో దూసుకెళ్లాలని ఇంగ్లండ్ భావిస్తున్నది. గత మ్యాచ్లో అదరగొట్టిన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి నివ్వగా అతడి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ బరిలో దిగనున్నాడు. ఇక వికెట్ కీపర్ బట్లర్ స్థానంలో బెన్ ఫోక్స్ ఆ బాధ్యతలు మోయనున్నాడు. మరి మొదటి రోజు నుంచే గింగిరాలు తిరిగే పిచ్ టీమ్ఇండియాకు కలిసొస్తుందా.. లేక మనం సిద్ధం చేసిన అస్త్రం మనల్నే బలి తీసుకుంటుందా చూడాలి!
ఆసీస్ గడ్డపై అదరగొట్టి భారత్లో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురవడంతో రెండో టెస్టుకు జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన అక్షర్ పటేల్.. శనివారం అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో మేనేజ్మెంట్ అక్షర్ను బరిలో దించాలని భావిస్తున్నది. దీనికి తోడు లోయర్ ఆర్డర్లో అతడు బ్యాట్తోనూ రాణించగలగడం భారత్కు బలం చేకూర్చనున్నది. అయితే గత రెండు మ్యాచ్ల్లోనూ రాణించిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను కొనసాగిస్తారా లేక కుల్దీప్ యాదవ్ కోసం అతడిని పక్కన పెడతారా చూడాలి. ఎలాగో స్పిన్ పిచ్ను సిద్ధం చేస్తుండటంతో పేసర్లతో పెద్దగా పని లేదని భావిస్తే ఒక రెగ్యులర్ బౌలర్తో పాటు హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తొలి టెస్టులో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ ఆకట్టుకోగా.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే గాడిలో పడాల్సి ఉంది. ఈ ఇద్దరు బ్యాట్కు పనిచెబితే టీమ్ఇండియాకు తిరుగుండదు.
ఏడాది కాలంలో స్వదేశంలో క్రికెట్ మ్యాచ్లు జరుగకపోవడంతో తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడలేకపోయిన అభిమానులు శనివారం మైదానంలో అడుగుపెట్టనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. రెండో మ్యాచ్ నుంచి స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని అనుమతించనుంది.
తొలి టెస్టులో ఫ్లాట్ పిచ్తో దెబ్బతిన్న టీమ్ఇండియా.. ఈసారి తమ ప్రధానాస్త్రమైన స్పిన్తో బదులు తీర్చుకోవాలనుకుంటున్నది. అందుకు తగ్గట్లే చెపాక్ పిచ్ను తొలి రోజు నుంచే స్పిన్కు సహకరించేలా తీర్చిదిద్దింది. వాతావరణం వేడిగా ఉండనుంది. వర్ష సూచన లేదు. మరోసారి టాస్ కీలకం కానుంది.
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, సుందర్/కుల్దీప్/హార్దిక్, బుమ్రా, ఇషాంత్.ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లే, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, మొయిన్ అలీ, బ్రాడ్, వోక్స్, లీచ్.
తొలి టెస్టుతో పోల్చుకుంటే పిచ్ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. మొదటి రోజు నుంచే స్పిన్ తిరిగేలా ఉంది. తొలి సెషన్ పూర్తయ్యేలోపు ఒక అంచనాకు రావొచ్చు. గత మ్యాచ్ ఓటమిని మరిచి ముందుకు సాగాలనుకుంటున్నాం. జట్టు మొత్తానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై నమ్మకం ఉంది. అతడే మా కెప్టెన్. మీరు మసాలా కోసం ప్రయత్నించినా లాభం లేదు. ఇకనైనా కెప్టెన్సీ ఉహాగానాలకు చెక్ పెట్టండి.
– రహానే, భారత వైస్కెప్టెన్