హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): దొంగ సర్టిఫికెట్ల కేసులో కాంగ్రెస్ నేత మధుయాష్కీ జైలుకెళ్లటం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆరోపించారు. తనపై మధుయాష్కీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. గురువారం తెలంగాణభవన్లో టీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్తో కలిసి సుధీర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మధుయాష్కీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అమెరికాలో ఉండి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి వందలమందిని ఇబ్బంది పెట్టిన మధుయాష్కీ అవినీతి చిట్టా తనవద్ద ఉన్నదని పేర్కొన్నారు. దొంగ సర్టిఫికెట్ల వ్యవహారంపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే మధుయాష్కీ వేదిక చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. తాము మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగామే కానీ, అమెరికా నుంచి వచ్చిన ఆర్నెళ్లకే అడ్డదారిలో మధుయాష్కీలా డబ్బుపెట్టి టికెట్లు కొనుక్కోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల అందరి చిట్టా తన వద్ద ఉన్నదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు.
టికెట్లు అమ్ముకున్న దుర్మార్గుడు
రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కీ.. ఆడబిడ్డ అనే సోయికూడా లేకుండా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో టికెట్లు అమ్ముకున్న దుర్మార్గుడని మండిపడ్డారు. దమ్ముంటే మళ్లీ అదే నిజామాబాద్ పార్లమెంట్ సీటుపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. యాదాద్రి ఆలయం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వెయ్యేండ్ల కీర్తిని పొందారని, 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఉప్పలమ్మ గుడి అయినా కట్టారా అని క్యామ మల్లేశ్ ప్రశ్నించారు.