కామారెడ్డి టౌన్, మార్చి 27: జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలు జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం పల్లెప్రగతి పనులతో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నది. దీంతో గ్రామాలన్నీ సుందరంగా మారుతున్నాయి. తమకు కావాల్సిన వసతులు అన్నీ కల్పించడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తి పన్ను చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. గతంలో గ్రామాల్లో ఏండ్ల తరబడి పన్నులు బకాయి ఉండేవి. గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ పన్ను వసూళ్లకు అంతగా శ్రద్ధ తీసుకునేవారు కాదు. ప్రస్తుతం అభివృద్ధి శరవేగంగా జరుగుతుండడంతో పన్నుల చెల్లింపు విషయమై అధికారులు గ్రామాల్లోని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పన్ను వసూలు చేయడానికి స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాలో 450 గ్రామాలు వంద శాతం పన్నులను వసూలు చేశాయి. మార్చి 31వ తేదీ వరకూ అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికార యంత్రాంగం కృషి చేస్తున్నారు.
జిల్లాలో పన్నుల వసూలు తీరు ఇలా..
జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది రూ.తొమ్మిది కోట్ల 54 లక్షల పన్నులను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 27వ తేదీ వరకు రూ.ఎనిమిది కోట్ల 67లక్షలను వసూలు చేశారు. దీంతో 93 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. 450 గ్రామాల్లో వంద శాతం పన్ను వసూలు కాగా.. మిగిలిన గ్రామాల్లో కూడా ఈనెలాఖరు వరకు వసూలు చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం, పంచాయతీ పాలకవర్గం కృషి చేస్తున్నది. గ్రామాల్లో అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తి పన్నును వసూలు చేస్తున్నారు.
గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు..
ప్రభుత్వ నిధులతో పాటు గ్రామాల్లోని ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వసూలైన పన్నును గ్రామాల్లో అభివృద్ధి పనులకే వినియోగిస్తామని వివరిస్తున్నారు. పన్నులు సకాలంలో చెల్లిస్తే.. అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని అధికారులు ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
నెలాఖారు వరకు లక్ష్యాన్ని చేరుకుంటాం..
జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా.. మార్చి 27వ తేదీ వరకు 450 గ్రామాల్లో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేశాం. ఇప్పటికే 93శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. మిగతా పన్నును ఈనెలాఖరు వరకూ పూర్తిగా వసూలు చేస్తాం.
ఇవీ కూడా చదవండి..
పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం