గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే పండంటి బిడ్డ పుడుతుంది. ఆ ఆరోగ్యం యోగ సాధనతో సాధ్యం అవుతుంది. శారీరక సమస్యలు తొలగిపోవడానికి, కాన్పు తేలిక కావడానికి ఉపవిష్ట కోణాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..
ముందుగా దండాసన స్థితిలో కూర్చోవాలి. రెండుకాళ్లను ఎడంగా చాపాలి. కాళ్లు రెండిటినీ చిత్రంలో చూపిన విధంగా సాధ్యమైనంత వరకూ పక్కకు జరపాలి.
కాళ్ల మడమలు నేలకు ఆనించి.. వేళ్లు పైకి చూస్తున్నట్టుగా ఉండాలి.
కాళ్లు పక్కకు జరపడం వల్ల తొడ, పిక్కల్లో నొప్పిరావొచ్చు. రెగ్యులర్గా సాధన చేస్తూ ఉంటే నొప్పి పోతుంది.
ఇప్పుడు కాళ్లను భూమికి అదిమి ఉంచే ప్రయత్నం చేయాలి. నడుమును కొద్దిగా ఎత్తి ఉంచాలి. కాళ్లు, చేతులు కిందికి ప్రెస్ చేస్తూ శరీరాన్ని
కొద్దిగా పైకి ఎత్తాలి.
ఈ స్థితిలో ఉన్నప్పుడు రెండు చేతులను పైకి తీసుకొని నిదానంగా ముందుకు వంగాలి. వెన్నెముక ఏటవాలుగా ఉంచుతూ నడుమును ముందుకు బెండ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులతో కాలి వేళ్లను పట్టుకోవాలి.
ఈ ఆసన స్థితిలో 10 నుంచి 20 సెకండ్లు ఉండాలి. ఈ సమయంలో శ్వాస నిదానంగా తీసుకోవాలి. తర్వాత రెండు చేతులను మెల్లగా పైకి తీసుకొని యథాస్థితికి రావాలి.
లాభాలు..
కటి కండరాలు దృఢమవుతాయి. తుంటి, పొత్తికడుపు ప్రాంతంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
కండ్లు తిరుగుతున్నా, వాంతులు అయ్యేలా ఉన్నా ఈ ఆసనం వేయకూడదు. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా ప్రయత్నించొద్దు. నిపుణుల సలహా తర్వాతే సాధన చేయాలి.