పటిష్టంగా లాక్డౌన్ అమలు
వాహనదారులకు పోలీసుల అవగాహన
పల్లె, పట్టణ రోడ్లన్నీ నిర్మానుష్యం
దండేపల్లి, మే 16 : కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ పిలుపు మేరకు దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఐదోరోజు లాక్డౌన్ కొనసాగింది. మండలంలోని ప్రధాన రహదారుల వద్ద ఎస్ఐ శ్రీకాంత్ వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు విధించారు. లా క్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నా రు. లాక్డౌన్తో ఉదయం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పల్లెలు, పట్టణాలే కాకుండా గిరిజన గూడేల్లో సైతం లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది.
జన్నారం మండలంలో..
జన్నారం, మే16 : మండల కేంద్రంతో పాటు 29 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలు కోసం ఉదయం 10గంటల తర్వాత రోడ్లపైన వాహనాలు తిరుగకుండా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కొందరు ఎలాంటి అనుమతులు, పనులు లేకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనాలకు ఫైన్లు వేసి వదలివేశారు. దీంతో మండలకేంద్రంలోని అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
చెన్నూర్లో..
చెన్నూర్, మే 16 : ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్నది. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు వెసులుబాటు సమయంలో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. అవసరమైన కూరగాయలు, నిత్యావసర సరుకులు తీసుకెళ్లారు. ఉదయం 10 గంటల తర్వాత నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారాయి. అనవసరంగా ఎవరూ బయట తిరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామాలకు ఎలాంటి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు నడవడం లేదు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, మే 16 : కోటపల్లి మండలంలో లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్డౌన్కు మినహాయింపు ఉండగా.. ప్రజలు ఆ సమయంలో వారి పనులు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి జనాలు రాకుండా ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ రవి కుమార్ చెక్పోస్టును సందర్శించారు. గూడ్స్, అత్యవసర వాహనాలకు మినహా రాకపోకలు లేకపోవడంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర వంతెన వెలవెలబోతూ కనిపించింది.