హైదరాబాద్: కాలం మారుతున్నా కొద్దీ మానవ జీవనశైలి మారిపోయింది. ఇప్పటి ఆహారపదార్థాలు, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ రోగాలు పెరిగిపోతున్నాయి. హృద్రోగ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, చాలామంది బాత్రూమ్లలోనే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. మరి దీనికి కారణం ఏమిటి..? గుండెపోటు మరణాలు బాత్రూమ్లలోనే ఎక్కువగా ఎందుకు సంభవిస్తున్నాయి..?
గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు బాత్రూమ్కు వెళ్లినప్పుడే గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఏజెన్సీ NCBI లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం గుండెపోటు మరణాలు బాత్రూమ్లలోనే చోటుచేసుకుంటున్నాయి. దాంతో బాత్రూమ్లలోనే గుండెపోటు మరణాలు సంభవిస్తుండటానికి గల కారణాలను నిపుణులు వెల్లడించారు.
వారి అభిప్రాయం ప్రకారం.. స్నానం చేసేటప్పుడు చాలామంది ముందుగా తలని తడుపుకుంటారు. దానివల్ల వేడి రక్తంగల శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నది. అన్ని వైపుల నుంచి తల భాగం వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో రక్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. శీతాకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.
అందుకే స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకుని ఆ తర్వాత పైవైపునకు వెళ్లడం శ్రేయస్కరం. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్తో బాధపడుతున్నవారు ఈ విధానాన్ని పాటించాలి. ఇక మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు విసర్జణ సమయంలో బాత్రూమ్లో ముక్కుతుంటారు. ఇలా చేసినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి గుండె సంబంధ రోగులతోపాటు మలబద్ధకం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, తలపై నుంచి స్నానం చేసే పద్దతిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.