మెదక్, మే 12 : కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో మెదక్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్తో పాటు బెడ్లు, సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా బాధితులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని మెదక్ జిల్లా కేంద్ర దవాఖానతో పాటు నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్ సీహెచ్సీ దవాఖానల్లో ఆక్సిజన్తో కూడిన 260 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో 120 ఆక్సిజన్ బెడ్లు ఉండగా, 60మంది చికిత్స పొందుతున్నారు. నర్సాపూర్ ఏరియా దవాఖానలో 100 బెడ్లు ఉండగా, 10మంది మాత్రమే బాధితులు ఉన్నారు. తూప్రాన్ సీహెచ్సీ దవాఖానలో 40 బెడ్లు ఉండగా, 10మంది చికిత్స పొందుతున్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మెదక్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో 260 ఆక్సిజన్తో కూడిన బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జిల్లా దవాఖానలో రెమ్డిసివిర్..
మెదక్ జిల్లాలో జిల్లా కేంద్ర దవాఖానలో రెమ్డిసివిర్ ఇంజక్షన్ అందుబాటులో ఉంది. కరోనా రోగులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి జిల్లా కేంద్ర దవాఖానలో రెమ్డిసివిర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఆక్సిజన్, బెడ్లు ఫుల్గా ఉండడమే కాకుండా కరోనా బాధితులకు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. వారం క్రితం మెదక్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్రావు రెమ్డిసివిర్ మందులు, ఇతర మందులు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలో రెమ్డిసివిర్ మందులను పెంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులతో ఫోన్లో ఆదేశించారు. నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్ సీహెచ్సీ సెం టర్లున్నాయి. జిల్లా కేంద్ర దవాఖానలో 140 సిలిండర్ల ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ అందజేస్తున్నారు. న ర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో 50 సిలిండర్లు, తూప్రాన్ సీహెచ్సీ సెంటర్లో 50 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్ను అందిస్తున్నారు. రోజురోజుకూ కరోనా వైరస్ పెరుగుతుండగా, కరోనా పరీక్షలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేగంగా చేస్తున్నారు. జిల్లాలోని 20 పీహెచ్సీలతో పాటు జిల్లా కేంద్ర దవాఖాన, నర్సాపూర్ ఏరియా, తూప్రాన్ సీహెచ్సీ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మెదక్ ఐసీయూలో 10 బెడ్లు.. మూడు వెంటిలేటర్లు..
జిల్లా కేంద్రమైన మెదక్లోని ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 120 ఆక్సిజన్ బెడ్లు ఉండగా, అందులో కేవలం 10 బెడ్లు మాత్రమే ఐసీయూకు వినియోగిస్తున్నారు. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తికి మెదక్ ఐసీయూలోనే కరోనా చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నర్సాపూర్ ఏరియా దవాఖానలో 50 సిలిండర్లు, తూప్రాన్ సీహెచ్సీలో 50 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా కేంద్ర దవాఖానలో మూడు వెంటిలేటర్లు ఉన్నాయి. వీటి ద్వారా కరోనా రోగులకు చికిత్సలు అందజేస్తున్నారు.
వైద్యానికి ఇబ్బందుల్లేవ్..
మెదక్ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో జిల్లా కేంద్ర దవాఖానలో రెమ్డిసివిర్ అందుబాటులో ఉంది. ఇప్పటికే కరోనా రోగుల కోసం ఆక్సిజన్తో పాటు బెడ్లు కూడా చాలా ఉన్నాయి. జిల్లాలోని జిల్లా కేంద్ర దవాఖానతో పాటు నర్సాపూర్, తూప్రాన్ ఆస్పత్రుల్లో 240 వరకు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్ర దవాఖానలో 120 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. అంతేకాకుండా మెదక్లో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తుంది.