గజ్వేల్ అర్బన్, మే 3: తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని స్వాగతిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. సోమవారం గజ్వేల్ 12వ వార్డు ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి 703 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థిపై 331ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులంతా గజ్వేల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం 12వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన అత్తెల్లి శ్రీనివాస్ను మున్సిపల్చైర్మన్ రాజమౌళి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అభివృద్ధి వైపే ప్రజలంతా నిలబడ్డారన్నారు.
అభివృద్ధి చేసేవారిని ఎప్పుడైనా ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువైందన్నారు. టీఆర్ఎస్ గెలుపు కారణమైన 12వ వార్డు ప్రజలందరికీ, కృషి చేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్. పార్టీ పట్టణాధ్యక్షుడు గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగు ముదిరాజ్, కౌన్సిలర్లు రజిత, రహీం, బాలమణి, లక్ష్మి కిషన్రెడ్డి, శ్రీను, నాయకులు సంతోశ్, సాయి, భూపాల్రెడ్డి, ఉమర్, రమేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన అత్తెల్లి
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 12వ వార్డు కౌన్సిలర్ ఉపఎన్నికలో గెలుపొందిన అత్తెల్లి శ్రీనివాస్ మంత్రి తన్నీరు హరీశ్రావును కలిశారు. సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళితో కలిసి సిద్దిపేటలో మంత్రి హరీశ్రావును కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మం త్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రజలు టీఆర్ఎస్ పార్టీతో పాటు అభ్యర్థిపై కూడా ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారని, కాబట్టి అదేస్థాయిలో ప్రజలకు సేవలందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని శ్రీనివాస్కు సూచించారు.
బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డు కౌన్సిలర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ 703ఓట్లతో ఘన విజయం సాధించాడు. గజ్వేల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12వ వార్డు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్కు 693ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాయిని యాదగిరికి 372ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి తుమ్మ భావన రవిరాజు 33ఓట్లు పోలయ్యి డిపాజిట్ గల్లంతయ్యింది. ‘నోటా’కు ఒక్క ఓటు వేయగా, 10 ఓట్లు చెల్లనవిగా అధికారులు తేల్చారు. 11 పోస్టల్ బ్యాలెట్లలో 10 ఓట్లు టీఆర్ఎస్కు అభ్యర్థికి రాగా ఒక్క ఓటు చెల్లనిదిగా అధికారులు తెలిపారు. కాగా మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి 703ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థిపై 331ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా సహాయ ఎన్నికల అధికారి తెలిపారు.