మోర్తాడ్/కమ్మర్పల్లి/ఆర్మూర్, జూలై 9 : అవెన్యూప్లాంటేషన్, మొక్కల పంపిణీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో అవెన్యూప్లాంటేషన్ను శుక్రవారం ఆమె పరిశీలించారు. మోర్తాడ్ మండలం దొన్కల్, గాండ్లపేట్, మోర్తాడ్ అవెన్యూప్లాంటేషన్ ఇంకా పూర్తికాకపోవడానికి కారణమేంటని అడగ్గా అధికారులు ఇంకా ట్రీగార్డులు, సపోర్టు కర్రలు రాలేదని చెప్పారు. దీంతో అవి వెంటనే పంపేలా చూస్తానని పనులు మాత్రం ఆగకూడదని ఆదేశించారు. ఇంటింటికీ ఎన్ని మొక్కలను పంపిణీ చేశారని కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో శ్రీధర్, సర్పంచులు లావణ్యముత్తెన్న, మామిడి సౌజన్య, బోగ ధరణి, సుమన్, కార్యదర్శులు రామకృష్ణ, అజయ్ పాల్గొన్నారు. కమ్మర్పల్లి శివారులోని జిల్లా సరిహద్దు వద్ద సుందరంగా కనిపించేలా రహదారిని తీర్చి దిద్దాలని సూచించారు. ఎంపీడీవో సంతోష్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్గౌడ్, ఏపీవో విద్యానంద్, జీపీ కార్యదర్శి శాంతి కుమార్, ఉప సర్పంచ్ గంగారాం, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్, చేపూర్ గ్రామాల్లోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన తవ్విన గుంతలను ఆమె పరిశీలించారు. అంకాపూర్లో రహదారికి ఇరువైపులా 600 మొక్కలు, చేపూర్లో 525 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో గోపీబాబు, చేపూర్ సర్పంచ్ ఇందూర్ సాయన్న, కార్యదర్శి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.