మేడ్చల్, జూన్30(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 2021-22 సంవత్సరానికిగాను 3వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పాఠ్యంశాల వివరాలు, టైంటేబుల్ను విడుదల చేసింది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు అన్ని విధాలుగా సిద్ధం కావాలని అధికారులు సూచించారు. కాగా, హైదరాబాద్లో 682 ప్రభుత్వ పాఠశాలలకు 83,774 విద్యార్థులు, రంగారెడ్డి జిల్లాలో 1351 పాఠశాలలకు 1,23,924 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
కాగా, ఆన్లైన్ తరగతుల నిర్వహణపై సూచనలు చేస్తూ.. మేడ్చల్ జిల్లాలోని మండల విద్యాధికారులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాధికారి ఎన్.ఎస్.ఎస్. ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. (WWW.medchalbadi.com)లో ఉన్న పాఠ్యాంశాలను తరగతి వారీగా విద్యార్థులు చూసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలోని 512 ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో పాటించాల్సిన సూచనలను క్రమం తప్పకుండా పాటించేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. తరగతుల వారీగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారు. విద్యార్థులు పాఠాలు వినేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. – ఎన్ఎస్ఎస్ ప్రసాద్, మేడ్చల్ జిల్లా విద్యాధికారి