నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ
ప్రజలందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్తో ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. టీకా వేయించుకున్నవారికి కరోనా సోకే అవకాశం చాలా తక్కువని, ఒకవేళ సోకినా, వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండబోదని అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోవచ్చన్నారు. రెండు డోసులను వేసుకున్న తర్వాత కూడా మాస్కు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం కొనసాగించాలని సూచించారు. లక్షణాలు లేనివారు పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ ఎంవీ రావు స్పష్టంచేశారు. లక్షణాలు ఉన్నప్పటికీ 90శాతం మందికి హోంఐసొలేషన్తోనే తగ్గిపోతుందని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందని, టీకా వేసుకున్న వారు చనిపోయిన దాఖలాలు ఇప్పటివరకు లేవని ప్రముఖ వైద్యుడు ఎంవీ రావు చెప్పారు. కొవిడ్ లక్షణాలు ఉంటేనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మాస్కు కూడా పెట్టుకోకుండా తిరిగితే ఒక్క కరోనా రోగి 140 మందికి వైరస్ను అంటిస్తాడని తెలిపారు.
కరోనా ఫస్ట్వేవ్కు, సెండ్వేవ్కు మధ్య తేడా ఏమిటి? దీని తీవ్రత ఎలా ఉన్నది?
సెకండ్వేవ్ చాలా ఉద్ధృతంగా ఉన్నది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. ఫస్ట్వేవ్లో 45 ఏండ్లకుపైబడిన వారిపై ఎక్కువ ప్రభావం కనిపించింది. ఇప్పుడు పదేండ్లలోపు పిల్లలకూ వస్తున్నది. కరోనానుంచి కోలుకున్నవారిలోనూ పోస్ట్కొవిడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది.
నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్గా చూపించినప్పటికీ చాలామందిలో కరోనా లక్షణాలుంటున్నాయి ఎందుకు?
కరోనా లక్షణాలున్నవారు మాత్రమే యాంటిజెన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ దాంట్లో తేలనట్టు అనిపిస్తే ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చినా కొంతమందికి లక్షణాలుంటున్నాయి. ఇలాంటివాళ్లు మాత్రమే డాక్టర్ సలహాతో సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఇటీవల చాలామంది డాక్టర్ల సలహా తీసుకోకుండానే సీటీ చేయించుకుంటున్నారు. దీనివల్ల రేడియేషన్ ప్రభావానికి గురవుతారు. దీంతోపాటు నిజంగా కరోనా వచ్చిన వారికి సకాలంలో రిపోర్టులు అందవు. ఇది కూడా వనరుల దుర్వినియోగమే.
కరోనా వచ్చిన వారందరూ దవాఖానలో చేరడం అవసరమా? ఎలాంటి వారు హాస్పిటల్లో చేరాలి?
కరోనా నిర్ధారణ అయిన మరుక్షణం నుంచే ఐసొలేషన్లోకి వెళ్లాలి. లేకపోతే ఒక రోగి ద్వారా సగటున పదిరోజుల్లో 140 మందికి వైరస్ సోకే ప్ర మాదం ఉన్నది. డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, హెచ్ఐవీ తదితర వ్యాధులున్నవారు కరోనా సోకినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివారు వైద్యులను సంప్రదించి దవాఖానలో చేరితే మంచిది. ఇక లక్షణాలు లేనివారు, చాలా తక్కువ లక్షణాలున్నవారు ఇంట్లోనే పల్స్ ఆక్సీమీటర్ ద్వారా తమ ఆక్సిజన్ లెవల్స్ను చూసుకోవాలి. 95 కన్నా తక్కువైన పక్షంలో వెంటనే హాస్పిటల్లో చేరాలి. వీరికి ఆక్సిజన్ సపోర్టు అవసరమవుతుంది. ఆస్తమా, శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారిలో ఆక్సిజన్ లెవల్ 92 వరకు ఉన్నా ఫర్వాలేదు. కరోనా నిర్ధారణ అయిన మరుక్షణమే దవాఖానలో చేరాలన్న ఆలోచన పూర్తిగా తప్పు.
కరోనా వచ్చినపుడు చాలామంది తాము వాడే మందులన్నింటిని ఆపేస్తున్నారు. ఇది సరైందేనా?
కరోనా వచ్చినపుడు హోంఐసోలేషన్లో ఉన్నా, దవాఖానలో ఉన్నా రోగి రెగ్యులర్గా వాడే అన్ని మందులను నిరభ్యంతరంగా వాడవచ్చు. చాలామంది కరోనా రావడంతో రెగ్యులర్గా వాడే బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ తదితర వ్యాధుల మందులను ఆపేస్తున్నారు. ఇలా చేస్తే సమస్య మరింత జటిలం అవుతుంది. ప్రాణాంతకం కూడా కావొచ్చు.
వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుందని చెప్తున్నారు.. వారి పరిస్థితి ఎలా ఉంటున్నది?
వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నది. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవారు త్వరగా కోలుకుంటున్నారు. టీకా వేసుకున్న తర్వాత కరోనా సోకిన వారు మరణించిన సంఘటనలు లేవు. ఫస్ట్వేవ్లో చాలామంది ఫ్రంట్లైన్ వారియర్లు చనిపోయారు. ఫ్రంట్లైన్ వారియర్లుగా మేం వ్యాక్సిన్ వేసుకున్నాం. వైద్య సిబ్బంది ఇప్పుడు కొంత ధీమాగా పనిచేయడానికి టీకా కూడా ఒక కారణం.
చాలామంది ఆక్సిజన్ యంత్రాలను, సిలిండర్లను కొనుక్కొని నిల్వచేసుకుంటున్నారు. ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవచ్చా?
ఎవరికి వాళ్లు ఆక్సిజన్ యంత్రాలను కొనుక్కోవడం, నిల్వ చేయడం సరికాదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఆక్సిజన్ యంత్రాలను, సిలిండర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోవడం వల్ల.. అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నవారి ప్రాణాలు తీసినవారవుతారు.
ఆహారంలో మార్పులు చేసుకోవాలా?
కరోనా వచ్చినవాళ్లు మాంసం, కూరగాయలు తినవచ్చు. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాలతో జలుబు చేస్తుందని కొంతమంది వీటికి దూరంగా ఉంటున్నారు. ఇది సరికాదు. వీలైనంత ఎక్కువ తీసుకుంటే మరీ మంచిది. కరోనాతో ఉన్నవారు ధైర్యం కోల్పోవద్దు.
హోంఐసొలేషన్లో ఉన్నవారు ఎలాంటి మందులు వాడాలి?
కరోనా మందులపై అనేక అపోహలున్నా యి. ఫలానా మందు పనిచేస్తుందని నిర్ధారణతో చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు ప్రపంచంలోనే లేవు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అని.. ఇం కేదో అని వాడేస్తున్నారు. యాంటిబయాటిక్స్ కూడా విరివిగా వాడేస్తున్నారు. ఇది ఏమా త్రం శ్రేయస్కరం కాదు. విటమిన్ల మాత్రలను కూడా చాలామంది వేసుకుంటున్నారు. వీటివల్ల పెద్దగా ఉపయోగాలుండవు. ఇక ఆయుర్వేదం అని, హోమియో అని కూడా వాడుతున్నారు. కర్పూరం, అల్లం, శొంఠి వంటి పదార్థాలను వడగట్టి పీల్చితే పోతుందని కూడా వాట్సాప్లో ప్రచారం జరుగుతున్నది. దీనివల్ల కూడా కరోనా తగ్గదు. కరోనా అనేక రూపాంతరాలు చెందింది. అందరిపై ఒకేలా ప్రభావం చూపించడంలేదు. కరోనా సోకినవారు వైద్యులను సంప్రదించి మందులను వాడడం మంచిది. లేదంటే ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
రెమ్డెసివిర్, స్టెరాయిడ్ల వాడకం బాగా పెరిగింది కదా? వీటితో ప్రాణాలు నిలుస్తాయా?
రెమ్డెసివిర్ ప్రాణదాత ఔషధం కాదు. రెమ్డెసివిర్ వాడటం వల్ల దవాఖానలో ఉండే రోజులు తగ్గుతాయి. కొంత ఉపశమనం లభిస్తుంది. ఇది కూడా అందరిలో ఒకేరీతిలో ఉండదు. స్టెరాయిడ్స్తో ఉపయోగం ఉంటుం ది. దీన్ని కరోనా వచ్చిన తొలివారంలోనే వాడొద్దు. వాడి తే అనేక దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉన్నది. రక్తం గడ్డ కట్టకుండా ఇచ్చే ప్రాణాధార ఔషధాలతో కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి ఎప్పుడు, ఎలా వాడాలన్నది రోగికి రోగికి మధ్య తేడా ఉంటుంది. కరోనా తీవ్రతను బట్టి వీటి వాడకం ఉంటుంది. కరోనా రెండోదశలో ఉన్నవారిని కాపాడేది ఆక్సిజన్. వీటన్నింటినీ దవాఖానలో, వైద్యుల పర్యవేక్షణలోనే ఇవ్వాల్సి ఉంటుంది.
ఎంత వేగంగా కరోనా వ్యాపిస్తుందో.. అంతే వేగంగా తగ్గుతుందని చెప్తున్నారు. దీంట్లో నిజం ఉన్నదా?
వైరస్లు ఏవైనా సరే వేగంగానే వ్యాపిస్తాయి. కరోనా ప్రత్యేకమైంది. ఇది చాలావేగంగా వ్యాపిస్తున్నది. అంతే వేగంగా తగ్గే అవకాశం ఉన్న ది. టీబీ వంటివి చాలా నిదానంగా వ్యాపిస్తాయి. కరోనా వేగంగా తగ్గుతుందన్న ధీమాతో ఉండవద్దు. మన జాగ్రత్తలే మనకు రక్ష. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను, వైద్యుల సూచనలను పాటించాలి.