శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో రెండు గ్రామ పంచాయతీలు అరుదైన ఘనత సాధించాయి. కొట్రాంకలోని రెండు పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టారు. 18 ఏండ్లు నిండిన గ్రామస్తులందరికీ కరోనా టీకా రెండు డోసులూ అందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడంలో ఈ ప్రాంతం ఆశా వర్కర్ల కృషిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
వ్యాక్సినేషన్ విజయవంతం చేసేందుకు నాలుగు నెలల గర్భిణిని అయిన తాను తన ఆరోగ్యంతో పాటు శిశివు ఆరోగ్యాన్నీ రిస్క్ చేసి ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నానని ఆశావర్కర్లలో ఒకరైన నసీం అఖ్తర్ చెప్పారు. తాము కొండలు, సరస్సులు దాటి వ్యాక్సినేషన్ చేపట్టేందుకు శ్రమించామని, దీని పట్ల తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఇక కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జమ్ముకశ్మీర్లోని గుల్మార్గ్లో పర్యాటకులను వీకెండ్స్లో అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.