సింగపూర్ : గత నాలుగు వారాల్లో సింగపూర్లో నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టడంతో టీకాలు తీసుకోని వారిసంఖ్య పరిమితంగా ఉంది. యూఏఈ తర్వాత సింగపూర్లోనే అత్యధికంగా 75 శాతం జనాభాకు టీకాలు వేశారు. జనాభాలో సగం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.
ఇక గత నాలుగు వారాల్లో సింగపూర్లో నమోదైన 1096 కరోనా కేసుల్లో 44 శాతం మంది అంటే 484 మంది వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారు కాగా, 30 శాతం మంది పాక్షికంగా టీకాలు తీసుకున్నారు. 25 శాతం మంది రోగులు అసలు టీకా సింగిల్ డోస్ కూడా తీసుకోలేదు. ఈ కేసుల్లో తీవ్ర లక్షణాలతో దవాఖానాలో చేరి ఆక్సిజన్ అవసరమైన వారు కేవలం ఏడుగురు కాగా వీరిలో ఐదుగురు టీకా తీసుకోని వారు ఒకరు సింగిల్ డోసు తీసుకున్న వ్యక్తి ఉన్నారు. ఇన్ఫెక్షన్ సోకినా టీకా పూర్తి డోసు తీసుకున్న వారికి వ్యాధి తీవ్రత ఉండదని మరోసారి వెల్లడైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపించాయని పేర్కొంది. వ్యాక్సినేషన్ పూర్తయిన వారిలో కరోనా కేసులు నమోదవడం టీకాలు పనిచేయలేదనడానికి నిదర్శనం కాదని, సింగపూర్లో అత్యధిక జనాభా టీకాలు తీసుకోవడంతో వారిలోనూ ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ డీన్ టియో యక్ యింగ్ పేర్కొన్నారు. సింగపూర్లో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.