న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఆన్లైన్లో అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ వర్సిటీ ఫైనల్ ఇయర్ విద్యార్ధికి రూ 5000 జరిమానా విధించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వర్సిటీ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్ధి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యఅతిధిగా గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో యూట్యూబ్ ద్వారా పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ చాట్రూమ్ ద్వారా కార్యక్రమానికి సదరు విద్యార్ధి విఘాతం కల్పించాడు.
విద్యార్ధి చేసిన వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవని, కేజ్రీవాల్ను కించపరిచేలా ఉన్నాయని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. క్రమశిక్షణను ఉల్లంఘించి దురుసుగా ప్రవర్తించిన విద్యార్ధిపై చర్యలు చేపట్టామని తెలిపింది. కాగా యూనివర్సిటీ ఫీజుల పెంపుకు నిరసనగా ఆన్లైన్లో గళమెత్తినందుకే విద్యార్ధిపై రూ 5000 జరిమానా విధించారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఆరోపించింది.