అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం
గువాహటి: అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవలే ముగిసిన అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారం చేపట్టగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వశర్మలలో ముఖ్యమంత్రి ఎవరవుతారనే ఉత్కంఠకు తెరదించుతూ ఆదివారం బీజేపీ అధిష్టానం హిమంత పేరును ఖరారుచేసింది. కాగా, సోమవారం సీఎం హిమంతతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 10 మంది బీజేపీ నుంచి ఉండగా, అసోం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ఇద్దరు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) నుంచి ఒకరు ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, రమేశ్వర్ తెలి, నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫ్యూ రియో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా హిమంత మాట్లాడుతూ.. ఐదేండ్లలో భారత్లోని టాప్-5 రాష్ర్టాలలో అస్సాంను నిలుపుతానని అన్నారు. అందుకోసం తక్షణమే పని మొదలుపెడుతామని తెలిపారు.