ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలమంది పిల్లలు నులి పురుగుల సమస్యతో బాధపడుతున్నారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇవి వ్యాపిస్తాయి. వీటిలో మూడు ముఖ్యమైనవి.. రౌండ్ వామ్, విప్ వామ్, హుక్ వామ్. బహిరంగ మల విసర్జన వల్ల నేలపై విడుదలైన అండాలు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. నులి పురుగులు పేగులలో స్థిర నివాసం ఏర్పరచుకొంటాయి. మన ఆహారాన్ని వినియోగించుకోవడమే కాదు, మన రక్తాన్నీ తాగుతాయి. దీంతో పిల్లల్లో రక్తహీనత, పెరుగుదల మందగించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. సమస్య వివిధ ఎలర్జీలకు దారి తీస్తుంది. పిల్లల తెలివితేటలపైనా ప్రభావం చూపుతుంది. దీంతో చదువుల్లో బాగా వెనుకబడిపోతారు.
ఈ సమస్య నివారణకు ప్రభుత్వం ‘జాతీయ నులి పురుగుల నిర్మూలనా దినోత్సవం’ జరుపుతున్నది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య ప్రచార ఉద్యమం. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఏటా రెండుసార్లు.. ఫిబ్రవరి 10, ఆగస్టు 10 తేదీల్లో మందు ఇస్తారు. ఆల్బెండజాల్ (Albendazole)1-2 సంవత్సరాల పిల్లలకు 200 ఎంజీ, రెండు సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వారికి 400 ఎంజీ ఇస్తారు. ఇవి ట్యాబ్లెట్లు, ద్రవరూపంలో లభిస్తాయి. ఆరోజు పిల్లలకు ఏదైనా అనారోగ్యం ఉంటే, ఐదురోజుల తర్వాత కోలుకున్నాక ఇవ్వాలి. దానిని ‘మాప్ అప్ డే’ అంటారు. నులి పురుగులున్న పిల్లలందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ దాదాపుగా అందరి కడుపులోనూ ఇవి ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరం ఏటా రెండుసార్లు తప్పక మందు ఇవ్వాలి.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు