చెన్నై: ఐఫోన్ 12 తయారీని ఇండియాలో ప్రారంభించినట్లు ఆపిల్ సంస్థ గురువారం తెలిపింది. స్థానిక కస్టమర్ల కోసం ఐఫోన్ 12ను ఇండియాలో తయారు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నదని ఈ సందర్భంగా ఆపిల్ చెప్పింది. అయితే ఇండియాలో ఎవరు ఈ ఫోన్ను అసెంబుల్ చేస్తారన్నది సంస్థ వెల్లడించకపోయినా.. ఆ సంస్థ తైవాన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫాక్స్కాన్ తన తమిళనాడు యూనిట్లో ఐఫోన్ 12 అసెంబ్లీ పనులు చేస్తుందని తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో యాపిల్ చైనాలోని తన ఉత్పత్తి యూనిట్లలో కొన్నింటిని ఇతర దేశాలకు తరలిస్తోంది. 2017లో తొలిసారి ఆపిల్ సంస్థ విస్ట్రాన్ ద్వారా ఐఫోన్ల అసెంబ్లీని ఇండియాలో ప్రారంభించింది. త్వరలోనే ఐప్యాడ్ అసెంబ్లీని కూడా ఇండియాకు తీసుకురావడానికి ఆపిల్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్ 12 ఇండియాకు రావడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇది దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.