పండ్ల తోటల సాగుపై రైతుల ఆసక్తి
కొల్లాపూర్లో రైతన్న ముందడుగు
560 ఎకరాల్లో సపోట సాగు
కొల్లాపూర్, ఏప్రిల్ 4: పండ్లతోటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రైతులు పండ్ల తోటల సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి హామీ, ఎస్సీ కార్పొరేషన్, ఉద్యానవన, మాడా సంస్థల ద్వారా తోటలు సాగుచేసే రైతులకు స్ప్రింక్లర్లు తదితర వాటిని 50శాతం నుంచి 75శాతం వరకు సబ్సిడీపై అందజేయడంతో ఐదారేండ్లుగా బీడు పొలాలు సైతం పండ్లతోటలతో స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా మామిడి మినహాయిస్తే సపోట, జామ, బొప్పాయి, రేగు పండ్లతోటలు సుమారు 632హెక్టార్లలో సాగుచేస్తే ఇందులో 560ఎకరాల్లో సపోట సాగు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పలు రకాల పండ్లతోటల సాగులో కొల్లాపూర్ ప్రాంత రైతులు ఒక అడుగు ముందుకేశారు. ఇక్కడి నేలలు అనువైనవి కావడంతో రైతులు పోటీపడి పండ్లతోటలు సాగు చేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కోడేరు, పెద్దకొత్తపల్లి, పాన్గల్, వీపనగండ్ల, కొల్లాపూర్, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాల రైతులు తమ పొలాల్లో పంటల సాగు వదిలి పండ్లతోటల వైపు దృష్టి మళ్లించారు. బోరుబావుల సౌకర్యం లేని రైతులు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అందే నీటిని తోటలకు పారబెట్టుకుంటున్నారు. నీళ్లు పారని రాళ్లు, గుట్టల ఎగువ భూముల్లో సైతం స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా రైతులు నీళ్లు పారబెడుతున్నారు. ఏటా పండ్లతోటల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. పండిన కాయల దిగుబడులను కొల్లాపూర్, నాగర్కర్నూల్, కర్నూల్, వనపర్తి తదితర పట్టణాల్లో చౌకధరలకు అమ్ముకుంటున్నారు.
అనువైన భూములు
కొల్లాపూర్ ప్రాంత భూములు పండ్లతోటల సాగుకు అనుకూలంగా ఉండే ఎర్రనేలలు కావడం విశేషం. నీటి వనరులు లేని బీడు పొలాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా సాగుచేసే రైతులకు 70శాతం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
సాగుకు తెగుళ్ల బెడద తక్కువ
కొల్లాపూర్ నియోజకవర్గంలో 560ఎకరాల్లో సపోట సాగు చేశారు. ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ. స్థానిక ఉద్యానశాఖ అధికారి లక్ష్మణ్ సపోట సాగులో తీసుకోవాల్సిన మెళకువలను వివరిస్తున్నారు. సపోట పండ్లు అధికశక్తిని, కాల్షియం, విటమిన్లను శరీరానికి అందిస్తాయి. జ్వరాల నుంచి కోలుకుంటున్న వారికి, పిల్లలకు ఈ పండు మంచి ఆహారం.
వాతావరణం
సపోట తేమతో కూడిన ఉష్ణమండలపు పంట. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. వర్షాధార పంటగా అనువైనది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ ఈ పంట పండుతుంది. తేలిక నేలల్లో త్వరగా ఎదిగి మంచి ఫల సాయాన్నిస్తోంది. ఇసుక భూములు, అధికచౌడు ఉన్న నేలలు, ఉప్పునేలలు కూడా నాటడానికి పనికొస్తాయి. నీటి ఎద్దడిని తట్టుకొనే స్వభావం ఉండటం వల్ల కొండ ప్రాంతాలు, లోతు తక్కువ నేలల్లో కూడా సాగుకు అనువైనవి. కొల్లాపూర్ ప్రాంతంలో సపోట సాగులో పాలరకం విస్తారంగా ఉన్న రకం అధిక దిగుబడినిస్తున్నది. పండు పరిమాణం చిన్నది. కోలగా ఉండి గుత్తులుగా కాస్తోంది. తోలు పలుచగా కండ మృదువుగా అధిక తీపి కలిగి ఉంటుంది.
నాటే విధానం
జూలై నుంచి ఫిబ్రవరి వరకు నాటేందుకు అనుకూలం. ఎంపిక చేసిన అంట్లను 10.0/10.0 మీటర్ల దూరంలో ఎకరాకు 40 మొక్కల చొప్పున నాటుకోవాలి. నాటడానికి1/1/1 మీటర్ల గుంతలను తీసి తవ్విన మట్టికి 30కిలోలు బాగా చవికిన పశువుల ఎరువు, 2 కిలోల సూపర్పాస్ఫెట్, 200 గ్రాములు, 2% పెరాథియాన్ పొడి మందు కలిపి గుంతల్లో నింపాలి.
ఎరువులు, నీటి యాజమాన్యం
తొలకరిలో తోటలను ఇరువైపులా దున్ని చెట్లకు పాదులు చేసి ఎరువులు వేయాలి. ప్రతి చెట్టుకూ మోతాదు ఎరువు చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో పాదంతా సమంగా వేసి మట్టిలో కలిపి ఎరువులు కరుగుటకు సరిపడేంత తేలికపాటి తడి మాత్రమే ఇవ్వాలి. నీటిని ఎక్కువగా తట్టుకుంటాయి. మొక్కలు నాటిన రెండేండ్ల వరకు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా 15 రోజులకోసారి తడి ఇవ్వాలి. ఎదిగిన చెట్లకు వేసవిలో 30రోజులకోసారి తడి ఇవ్వాలి. ప్రతి చెట్టుకూ కాలాన్ని బట్టి 60-100 లీటర్ల నీరు ఇవ్వాలి.
పండ్లతోటల సాగుతో లాభాలు
పెట్టుబడులు పెట్టలేక సేద్యం మానుకునే పరిస్థితులున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా పండ్లతోటలు సాగుచేస్తున్నాం. పండ్ల మొక్కలు నాటిప్పుడు ఖర్చు పెడితే ఆ తర్వాత మనకు డబ్బులే డబ్బులు. నాలుగేండ్లు తోటలో అంతర పంటలు వేసుకోవచ్చు. నాకున్న మూడెకరాల్లో మూడేండ్ల కింద సపోట, మామిడి తోట పెట్టాను. సపోట కాయలు కాస్తోంది.
నర్సింహ, రైతు, రామాపూర్