న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సింగిల్ డోస్ ప్రభావవంతంగా వైరస్ను నిరోధిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారికి స్పుత్నిక్ వీ సింగిల్ డోస్తో వైరస్ నుంచి 94 శాతం రక్షణ లభించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో వైరస్ సోకిన వ్యక్తులకు వ్యాక్సిన్ రెండవ డోసుతో ఎలాంటి ప్రయోజనం చేకూరినట్టు అధ్యయనంలో ఆధారాలు లభించలేదని వారు పేర్కొన్నారు.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత 94 శాతం మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందినట్టు వెల్లడైందని జర్నల్ సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. అర్జెంటీనాలోని ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన నిర్వహించారు. గతంలో వ్యాధి బారిన పడని వారు రెండు టీకా డోసులు తీసుకున్నప్పటికీ వారి కంటే వైరస్ నుంచి కోలుకున్న వారిలో స్పుతిక్ వీ సింగిల్ డోస్తో యాంటీబాడీల స్ధాయి పెరిగినట్టు తేలిందని పరిశోధకులు వివరించారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో అప్పటికే యాంటీ బాడీలు తగినంతగా ఉంటాయని వారికి వ్యాక్సిన్ సింగిల్ డోసుతో వైరస్ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని గతంలో హైదరాబాద్కు చెందిన ఏఐజీ హాస్పిటల్స్ చేపట్టిన అధ్యయనంలోనూ వెల్లడైంది. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 5 మధ్య కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న 260 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం నిర్వహించారు. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి ఐసీఎంఆర్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.