న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి వేగంపై చెన్నైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ చేపట్టిన అధ్యయన వివరాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జులై 30 నాటికి కరోనా ఆర్ ఫ్యాక్టర్ 1.01గా ఉంది. కరోనా బారినపడిన వ్యక్తి ఎంతమందికి వ్యాధిని వ్యాప్తి చేస్తాడనే దాన్ని ఆర్ ఫ్యాక్టర్ అంచనా వేస్తుంది. 1.01 ఆర్ ఫ్యాక్టర్ అంటే ఓ కరోనా రోగి ద్వారా మహమ్మారి 100 మందికి సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు.
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ముంచెత్తినప్పుడు మార్చి 9-ఏప్రిల్ 21 మధ్య కొవిడ్-19 ఆర్ ఫ్యాక్టర్ 1.37గా అంచనా వేశారు. ఏప్రిల్ 29-మే 7 మధ్య ఇది 1.10కి తగ్గింది. ఆర్ కౌంట్ 1 కంటే తక్కువకు పడిపోతే వైరస్ వ్యాప్తి మందగించినట్టు భావిస్తారు. ఇక ప్రస్తుత ఆర్ ఫ్యాక్టర్ను గమనిస్తే మరో రెండు వారాలు ఇది అధిక స్ధాయిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈశాన్య ప్రాంతంలో పలు రాష్ట్రాల్లో వైరస్ సంక్రమణ వేగం 1 కంటే ఎక్కువగానే ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు సితభ్ర సిన్హా పేర్కొన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,314 కరోనా తాజా కేసులు వెల్లడవగా 424 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.