లండన్: చాంపియన్స్ లీగ్కు పోటీగా ప్రారంభిద్దామనుకున్న యురోపియన్ సూపర్ లీగ్ ఇక లేనట్లేనని ప్రకటించారు ఫౌండర్, జువెంటస్ క్లబ్ చైర్మన్ ఆండ్రియా అగ్నెల్లీ. ఈ లీగ్కు సై అన్న 24 గంటల్లోపే ఆరు ఇంగ్లిష్ క్లబ్లు వెనక్కి తగ్గడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన లీగ్ ప్రారంభం కాకముందే ముగిసిపోవడానికి రాజకీయ నాయకులే కారణమని అగ్నెల్లీ ఆరోపించారు. ఆరు ఇంగ్లిష్ క్లబ్లను బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ బెదిరించడం వల్లే వాళ్లు వెనక్కి వెళ్లిపోయారని ఆయన అన్నారు.
ఈ కొత్త లీగ్ను ఆదివారమే ప్రకటించారు. అయితే 48 గంటల్లోనే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అభిమానుల నుంచే కాకుండా ఫుట్బాల్ పెద్దలు, చివరికి బ్రిటన్ ప్రధాని కూడా బెదిరింపులకు దిగడతో ఆరు ఇంగ్లిష్ క్లబ్లు వెనక్కి తగ్గాయి. దీంతో లీగ్లో ఇటలీ, స్పెయిన్కు ఆరు క్లబ్లే మిగిలాయి. అయినా లీగ్ను కొనసాగిస్తారా అని అగ్నెల్లీని ప్రశ్నించగా.. నిజాయతీగా చెప్పాలంటే ఆ పని చేయలేను అని అన్నారు.
ఇప్పటికీ ఈ లీగ్ ప్రారంభిస్తానని ప్రకటించినందుకు తానేమీ చింతించడం లేదని ఆయన స్పష్టం చేశారు. యురోపియన్ ఫుట్బాల్కు మార్పు అవసరమని ఇప్పటికీ తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ టీమ్స్ తప్పుకున్న తర్వాత ఎన్నో క్లబ్లు తాము లీగ్లో చేరే అవకాశం ఉందా అని తనను అడిగాయని, వాటి పేర్లు తాను చెప్పదలచుకోలేదని అగ్నెల్లీ అన్నారు.